ఏపీలో ఎలక్షన్ ఫీవర్ పీక్ స్టేజ్కు చేరిపోయింది. ఎన్నికల పోలింగ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఓ వైపు సీఎం జగన్, మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మరింత పదునెక్కించే పనిలో పడ్డారు. అంతే కాదు సేమ్ డేట్..సేమ్ సెంటర్లో మాటల తూటాలు పేల్చేందుకు ఈ ఇద్దరు నేతలు సై అంటున్నారు. దీంతో సీమ సందుల్లో సవాళ్ల రాజకీయం మరింత వేడెక్కనుంది. వచ్చే రెండు వారాలు రాష్ట్రంలో ఎన్నికల వేడి కనిపించనుంది.
ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అవడంతో పార్టీలన్నీ ప్రచారం కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. ఇక అగ్రనేతల ప్రచార పర్వమే మిగిలింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అయితే షెడ్యూల్ విడుదల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నేతలు.. నోటిఫికేషన్ వచ్చేలోగా మరోసారి రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఒకవైపు సీఎం జగన్.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరు అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరగనుంది.
ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ..తాజాగా మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్ర లోని ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది. తొలిరోజు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి యాత్రను ప్రారంభించనున్నారు సీఎం జగన్. అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 28న నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం నంద్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. 29న కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించనున్న సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఈ నెల 27 నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. మార్చి 31 వరకు ఆయన పర్యటనలు కొనసాగుతాయి. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్ర బాబు పాల్గొననున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. అయితే సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ రాయలసీమ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఆసక్తిరేపుతోంది. సొంత జిల్లాల ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఇద్దరు నేతలు.. మార్చి 29న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకేసారి పర్యటించనున్నారు. మొత్తానికి రెండు పార్టీల అగ్రనేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార పర్వంలో బిజీబిజీగా ఉండగా, అధినేతలు జనం మధ్యకు వచ్చి ప్రచార ఉధృతిని మరింత పెంచనున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతా రు అనేది వేచి చూడాలి.