స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: స్నేహితుడు అని నమ్మితే నట్టేట ముంచాడు. కష్టాల్లో ఉన్నాడని ఆర్థికంగా భరోసా ఇస్తే దారుణంగా వ్యవహరించాడు. డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు రాక్షసుడిలా మారాడు. ఏకంగా చిన్ననాటి స్నేహితురాలినే కిరాతకంగా చంపేశాడు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెలపాడులో ఈ దారుణ ఘటన జరిగింది. జిల్లెలపాడు గ్రామానికి చెందిన కోట రాధ(35) అనే మహిళ, అదే మండలం గుండ్లోపల్లికి చెందిన కేతిరెడ్డి కాశిరెడ్డి చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాల, కాలేజీలో విద్యాభ్యాసం చేశారు.
రాధకు సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మోహన్రెడ్డితో వివాహం జరిగింది. భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావడంతో హైదరబాద్ లో స్థిరపడ్డారు. అప్పటికే నగరంలో జాబ్ చేస్తున్న కాశిరెడ్డి వీరితో కుటుంబసభ్యుడిలా కలిసిపోయాడు. ఈ క్రమంలో కాశిరెడ్డి ఉద్యోగం పోవడంతో తన దగ్గర ఓ ప్రాజెక్ట్ ఐడియా ఉందని ఆర్థిక సాయం చేయాలని అడిగాడు. దీంతో స్నేహితుడికి భరోసా ఇవ్వాలని రూ.80లక్షలు అప్పుగా ఇచ్చారు. అయితే కొన్నేళ్లు అయినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో కాశిరెడ్డిని పలుమార్లు ప్రశ్నించారు.
ఈ తరుణంలో జిల్లెలపాడు గ్రామంలో చౌడేశ్వరిదేవి కొలుపులు ఉండడంతో ఈనెల 11న రాధ అక్కడికి వచ్చారు. డబ్బులు ఇస్తానని కనిగిరి రావాలని కాశిరెడ్డి మెజేస్ చేయడంతో ఆమె చిన్నకుమారుడితో కలిసి వెళ్లింది. అనంతరం రాత్రి ఏడు గంటల తర్వాత ఆమె అదృశ్యమైంది. కుటుంబసభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్వీచ్ ఆఫ్ వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమె ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్ గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లగా అప్పటికే ఆమె విగతజీవిగా రోడ్డుపై పడి ఉన్నారు. నిందితులు రాధను దారుణంగా హత్య చేసినట్లు అక్కడి ఆనవాళ్లు బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు.
రాధ కాళ్లు, ఛాతిపై నుంచి కారు నడిపినట్లు గుర్తించారు. అనంతరం ముఖంపై బండరాళ్లతో మోది, సిగరెట్లతో కాల్చి హత్య చేసినట్టు నిర్ధారించుకున్నారు. ఆమె శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్యలో ముగ్గురు, నలుగురు పాల్గొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని.. నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ మలికాగార్గ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రధాన నిందితుడు కాశిరెడ్డి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు.