మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా ఆస్తులన్ని సునీతా పేరు మీదే ఉన్నాయని తెలిపారు. ఆస్తుల కోసం ఆయనను హత్య చేయాల్సిన అవసరం అల్లుడు రాజశేఖర్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. ఆయన పేరు మీద ఉన్న అరకొర ఆస్తులు కూడా సునీత పిల్లల మీద వీలునామా రాశారని తెలిపారు. అలాంటప్పుడు ఆస్తుల కోసం అల్లుడు ఎందుకు చంపుతారని.. అలా చంపాల్సి వస్తే సునీతను చంపాలన్నారు.
వివేకా వ్యక్తిగత జీవితం గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని.. చిన్నాన్న పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని మండిపడ్డారు. మన మధ్య లేని ఓ వ్యక్తి గురించి ఇలాంటి దిగజారుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆస్తుల కోసమే వివేకాను ఆయన కూతురు సునీత, అల్లుడు హత్య చేశారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపిస్తుండగా.. తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యలతో ఆయన మరింత ఇరకాటంలో పడ్డారనే చర్చ జరుగుతోంది.