ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉండడంతో రాష్ట్రంలో రోజు రోజుకు పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరుకుంటోంది. అధికారమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అధికార వైసీపీ అయితే ఏపీలో మరోసారి విజయకేతన ఎగురవేయాలని కంకణం కట్టుకుంది. గెలుపే లక్ష్యంగా అధినేత జగన్ వ్యూహా లు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పార్టీ సీనియర్లతో మేనిఫెస్టోపై సమీక్షించారు సీఎం జగన్. సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోకు ధీటుగా వైసీపీ కొత్త మేనిఫెస్టోను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలు, యువత, రైతులకు పెద్దపీట వేస్తూ వారికి లబ్ది చేకూరేలా కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. ప్రధానంగా వైసీపీకి కలిసొచ్చిన పెన్షన్ పెంపు, అమ్మ ఒడి లాంటి అంశాలను కొనసాగిస్తూనే.. పించన్లు మరింత పెంచేలా కసరత్తు చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది విడతల వారీగా పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచాలని భావిస్తున్నారు.
వైసీపీ కొత్త మేనిఫెస్టోలో పలు ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసాను 15వేల నుంచి 25వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఆరోగ్య శ్రీ పరిధిని 20 లక్షలకు పెంచే అవకాశం కనిపిస్తోంది. అమ్మఒడి 15వేల నుంచి 20వేలకు, అలాగే వైఎస్సార్ చేయూత కింద 18వేల 500 నుంచి 20వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇక సామాజిక పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల దాకా పెంచుతున్నట్లు సమాచారం. దీంతోపాటు కొత్త హామీలలో రెండు లక్షల దాకా రైతులకు రుణ మాఫీ, అలాగే డ్వాక్రా రుణమాఫీ హామీలు ఈసారి అత్యంత కీలకం కాబోతున్నాయని అంటున్నారు. ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ఈ సారి మేని ఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పేదలకు 20 లక్షల ఇళ్లు, విద్యార్థులకు ల్యాప్ టాప్స్, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి హామీలు కొత్త మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉంది.