ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు వైఎస్సార్ సీపీ సన్నద్ధమైంది. అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు వైసీసీ అధినేత, సీఎం జగన్. ఈనెల 16వతేదీన కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద 2019 ఎన్నికల తరహాలోనే ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రోజుకు రెండు లేదా మూడు సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమైంది. రోజూ ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు చోట్ల బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభల ద్వారా వైఎస్సార్ సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు జగన్. ఇదే ఉత్సాహంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే మేనిఫెస్టోను విడుదల చేసి ప్రచార భేరి మోగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులను ప్రకటించేలోగా ప్రచారంలో దూసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు.