పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను ప్రయోగిస్తోందా..? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలు అందులో భాగమేనా.? బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం ఎన్నికల్లో వర్క్ ఔట్ అవుతుందా..? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయని, సెంటిమెంట్ అంశం తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుందా.?
ఉద్యమం పుణ్యమా అంటూ తెలంగాణలో బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. దీంతో పార్ల మెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని బీఆర్ఎస్ భావించింది. అందుకే ఎప్పటిలాగే తన చేతిలో ఉన్న చివరి అస్త్రం తెలంగాణ సెంటిమెంట్ను మరో సారి తెరపైకి తీసుకు వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ తమకు 10 నుండి 12 స్థానాలు ఇవ్వాలని ప్రజలను కోరుతోంది. బిఆర్ఎస్ పార్టీకి మెజారిటీ స్థానాలు ఇస్తే తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు ఉంటాయని బిఆర్ఎస్ అగ్ర నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ ప్రజల దగ్గర చెప్పుకొ స్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలో ఉన్నప్పుడు 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే రేవంత్ సర్కార్ వాటిని కుదించాలని చూస్తోందని కేసీఆర్ అన్నారు. దీంతో జిల్లాల సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ తర్వాత మాజీమంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు. జూన్ రెండవ తేదీతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాల పరిమితి ముగుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటంతో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని పొడిగిం చాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని హరీష్ రావు అన్నారు. ఇప్పటికే ఆంధ్రా నేతల నుండి డిమాండ్ వస్తుందని అన్నారు. ఇలా జరగకుండా అడ్డుకోవడానికి తెలంగాణ నుంచి బిఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో తప్పక ఉండాలని హరీష్ రావు అంటున్నారు.
నిజానికి హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండవ రాజధాని చేయాలనే అంశాన్ని మాజీ గవర్నర్ బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు గతంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలో బీజేపీ మూడవ సారి అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయితే హక్కులన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని బిఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీంతో పాటు బిఆర్ఎస్ పార్టీకి 10 నుండి 12 పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఆరు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టడంతో పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ..బీఆర్ఎస్ పార్టీ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను ఎన్నికల అస్త్రంగా తెరపైకి తెచ్చింది. మరి ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పాచికలు పారుతాయా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వర్క్ ఔట్ కాని సెంటిమెంట్ అస్త్రం ఈసారి ఏమైనా ఫలితాన్ని ఇస్తుందా అనేది వేచి చూడాలి.


