జాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఢిల్లీ పీఠానికి దగ్గరిదారిగా ఉత్తరప్రదేశ్ను రాజకీయ పండితులు భావిస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 80 లోక్సభ సీట్లు న్నాయి. కేంద్రంలో మూడోసారి అధికారం లోకి రావాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19న ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలివిడత ఎన్నికలు జరగ నున్న జాబితాలో సహరన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నూర్, నగీనా, రాంపూర్, పిల్భిత్ నియోజక వర్గాలున్నాయి.ఈ ఎనిమిదిలో ముజఫర్నగర్, కైరానా, పిల్భిత్..బీజేపీ సిట్టింగ్ సీట్లు కావడం విశేషం. ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఇటీవల కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకం కూడా ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్కు 17 సీట్లు కేటాయించారు. మిగతా 63 సీట్లలో సమాజ్వాదీ పార్టీ సహా ఇండియా కూటమిలోని మిగతా భాగస్వామ్యపక్షాలు పోటీ చేస్తున్నాయి. కాగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన 17 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలను 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకోవడం విశేషం. ఇదిలా ఉంటే 2019 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున ఒక్క సోనియా గాంధీయే విజయం సాధించారు. అప్పట్లో తమ స్వంత నియోజకవర్గమైన రాయ్బరేలి నుంచి సోనియా పోటీ చేసి గెలుపొం దారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. అటు ఎన్డీయే ఇటు ఇండియా కూటమి…రెండింటినీ సమాన దూరంలో ఉంచింది. కాగా ఉత్తరప్రదేశ్పై ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ తమకు ప్లస్ పాయింట్ అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. అలాగే అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అంశం, తమ పార్టీకి కలిసొస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. పొత్తులు కుదుర్చుకోవడంలో కూడా భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది. ఇటీవల జయంత్ చౌధురి నాయకత్వానగల రాష్ట్రీయ లోక్దళ్ తో కమలం పార్టీ పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రీయ లోక్దళ్ కు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో గట్టి పట్టుంది. అంతేకాదు ఆర్ఎల్డీ మద్దతుతో జాట్ సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్లోని మరో ఉప ప్రాంతీయ పార్టీ భారతీయ సమాజ్ పార్టీతోనూ కమలం పార్టీకి పొత్తు ఉంది. సుహేల్దేవ్ నాయకత్వంలోని భారతీయ సమాజ్ పార్టీ …పూర్వాంచల్ ప్రాంతంలో బలంగా ఉంది. దీంతో పూర్వాం చల్ ప్రాంతం ఓట్లు తమ ఖాతాలోనే పడతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. వీటన్నిటితో పాటు ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలన కూడా ప్లస్ పాయింట్ అవుతుందంటున్నారు బీజేపీ నాయకులు. ఉత్తరప్రదేశ్ అంటే ఒకప్పుడు అల్లర్లకు కేరాఫ్ అడ్రస్గా ఉండేది. పారిశ్రామికవేత్తలను గ్యాంగ్స్టర్లు బెదిరించి, డబ్బు గుంజడం సర్వసాధారణంగా ఉండేది. కొన్ని జిల్లాల పేర్లు చెబితేనే, ప్రజలు గడగడ వణికేవారు. అయితే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలకు టాప్ ప్రయారిటీ ఇచ్చారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడానికి కూడా యోగి ఆదిత్యనాథ్ తీవ్ర కృషి చేశారు. ప్రశాంతత నెలకొనడంతో ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి మిగతా ప్రాంతాల నుంచి పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. ఉత్తరప్రదేశ్కు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఇలా వచ్చిన పారిశ్రా మికవేత్తలకు యోగి సర్కార్ రెడ్ కార్పెట్ పరచింది. అంతిమంగా పారిశ్రామికంగా ఉత్తరప్రదేశ్ దూసుకు పోయింది. ఇదిలాఉండగా పిల్భిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి బీజేపీ టికెట్ లభించలేదు. వరుణ్ గాంధీకి బదులుగా ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద్కు ఫిల్భిత్ టికెట్ కేటాయించింది బీజేపీ అగ్రనాయకత్వం. ఏమైనా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న ప్రముఖుల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులున్నారు.