స్వతంత్ర, వెబ్ డెస్క్: పండించిన ధాన్యానికి విలువ కరువై, చేతులారా ఆ ధాన్యాన్ని తగలబెట్టే స్థాయికి తెలంగాణ రైతును తీసుకొచ్చారు అంటే.. కేసీఆర్ సర్కారు సిగ్గుతో తలదించుకుని, ఉరి వేసుకోవాలి కదా.. అంటూ విరుచుకుపడ్డారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్. షర్మిల. మిల్లర్లు 10/12 కిలోలు కోతలు పెట్టి దోపిడీ చేస్తుంటే.. ఈ దొంగ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వడ్లు కొనడం లేదని ఆవేదనతో రైతన్న గుండె చెరువై వడ్లు తగలబెడుతుంటే కనీసం కనికరం కూడా లేదని మండిపడ్డారు. నెల రోజులుగా అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండి ప్రాణాలు పోతుంటే ఈ నియంత సర్కారుకు సోయి రావడం లేదు. పక్క రాష్ట్రాల్లో మీటింగులు పెట్టి, కిసాన్ సర్కారు అని దిక్కుమాలిన ప్రచారం చేసుకునే కేసీఆర్ దొరకు.. మన రాష్ట్రంలో రైతుల కోసం కనీసం సమీక్ష పెట్టే తీరిక కూడా లేదని ఫైర్ అయ్యారు.
రైతులు రోడ్డెక్కినా.. ఆత్మహత్యలు చేసుకుంటున్నా, కేసీఆర్ గారికి దున్నపోతు మీద వాన పడ్డట్టే. యాసంగిలో 80లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని టార్గెట్ పెట్టుకుంటే.. ఇప్పటి వరకు మీరు కొనుగోలు చేసింది కేవలం 38.50లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఈ లెక్కన సగం ధాన్యం కొనని మీరు వారం రోజుల్లో వర్షాకాలం మొదలతుంటే.. మిగిలిన 40 లక్షల టన్నులు ఎప్పుడు కొంటారు? వరి వేస్తే ఉరి అని చెప్పినందుకు..వరి వేశారని కొనకుండా కుట్ర చేస్తున్నావా దొర.! మీ దిక్కుమాలిన పాలనలో రైతు రుణమాఫీ నుంచి పంట కొనుగోలు చేసే వరకు అన్ని మోసాలే.ఇప్పటికైనా రైతులను తేమ, తరుగు పేరుతో దోపిడీ చేయకుండా, పండించిన ప్రతి గింజా కొనాలని వారం రోజుల్లో కొనాలని కేసీఆర్ ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల పేర్కొన్నారు.