అయిపోయిన పెళ్లి కి బాజాలు మోగించినట్టు ఉంది టీ కాంగ్రెస్ పరిస్థితి. ఓవైపు లోక్ సభ అభ్యర్థుల ప్రకటన చేస్తూనే ,మరోవైపు క్షేత్ర స్థాయిలో అభిప్రాయ సేకరణ జరపడం ఆశ్చర్యపరుస్తోంది. ఎంపిక పక్రియ లో అన్ని దశలు దాటిన తర్వాత ఈ మీటింగ్ లు ఎందుకో ఎవరికి అర్థం కావడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఉత్తుత్తి మీటింగే అంటున్నారు కొందరు నేతలు.
కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక పక్రియ టెలివిజన్ సీరియల్ తలపిస్తుంది. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక పక్రియ ను తెలంగాణ కాంగ్రెస్ రెండు నెలల క్రితమే మొదలుపెట్టింది.. ఆశావాహుల నుంచి దరఖాస్తు లు స్వీకరిస్తే మొత్తం 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు మూడు సమావేశాలు నిర్వహించిన అనంతరం స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తు లను స్క్రూట్నీ చేసింది. డిసిసి లు, నియోజకవర్గ నేతలు ,ఎమ్మెల్యే లు ,సీనియర్ నేతల అభిప్రాయం సేకరణ తర్వాతే అభ్యర్థుల షార్ట్ లీస్ట్ ను టీపీసీసీ, ఏఐసీసీ కి పంపింది ఆ తర్వాతే ఏఐసీసీ అభ్యర్థుల పక్రియ పై కసరత్తు చేసి ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. ఇక నేడో ,రేపో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పక్రియ మొదలు పెట్టనున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ అభిప్రాయ సేకరణ అంటూ ఇంఛార్ది దీపాదాస్ మున్షీ, కథ ను మొదటి కి తీసుకొచ్చారు.
అభ్యర్థులను ప్రకటించిన నాలుగు స్థానాలకు మినహా మిగతా 13 స్థానాలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతల అభిప్రాయం తీసుకున్నారు మున్షీ. అయితే, మిగిలిన 13 స్థానాల లో సైతం దాదాపు 8, 9 స్థానాల్లో అభ్యర్థుల విషయం లో ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కేవలం 4, 5 స్థానాల్లో ఇద్దరు ,ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండడంతో సందిగ్ధత నెలకొంది. మరోవైపు పోటీ ఉన్న స్థానాల పై ఏఐసీసీ ఫ్లాష్ సర్వే చేయిస్తోంది. అంటే దాదాపు మిగిలిన అభ్యర్థుల ఎంపిక విషయంలో సైతం ఇక రాష్ట్ర పార్టీ ప్రమేయం ఉండదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త గా అభిప్రాయ సేకరణ చేయడం తో ఇందంతా ఉత్తుత్తి మీటింగ్ లేనని…తమ అభిప్రాయం తీసుకోలేదని నేతలెవరూ ఆనకుండా ఉండడానికే ఈవిధంగా ఈ మీటింగ్ లు నిర్వహిస్తున్నారని మీటింగ్ కు అటెండ్ అయిన నేతలు తెలియజేస్తున్నారు.
మీటింగ్ కు వచ్చిన నేతలలో ఎక్కువ మంది పార్టీ హైకమాండ్ కే నిర్ణయం వదిలివేస్తున్నామని చెప్పగా మరికొందరు మొక్కుబడిగా ఎవరో ఒకరి పేరు చెప్పినట్టు తెలిసింది. అయితే అటూ మున్షీ నుంచి కాని ఏఐసీసీ సెక్రటరీ ల నుంచి కాని పోటీ ఉన్న వారి లో ఎవరికి సపోర్ట్ చేస్తారని అడగడం లేదని సమాచారం. కేవలం నేతలు చెప్పిన విషయాన్ని రికార్డు చేసుకుంటుంన్నారని, ఏఐసీసీ దృష్టిలో ఎవరి పేరు ఉందో తెలియక ఎవరి పేరు చెప్తే ఏం జరుగుతుందో అని కొందరు , ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నాక మన అభిప్రాయం ఎందుకని కొందరు.. నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేసినట్టు తెలిసింది. శంఖంలో తీర్థం…సామెత మాదిరి అభిప్రాయ సేకరణ చేయడంతో.. ఉత్తుత్తి మీటింగే అని నేతలు తేల్చిపారే స్తున్నారు.


