పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలనుకున్న గులాబీ పార్టీకి నిరాశే మిగిలింది. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం మొదలుపెట్టింది. మరి గులాబీ ఓటమికి కారణాలేంటి..?
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి పార్లమెంటులో ప్రాతినిధ్యం కోల్పోయింది. 2001 లో పార్టీ ఆవిర్భావం జరిగగా.. 2004, 2009, 2014, 2019, 2024 లోక్ సభ ఎన్నికలను గులాబీ పార్టీ ఎదుర్కొంది. అయితే.. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన బిఆర్ఎస్ పార్టీ 5 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, హన్మకొండ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక 2009 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగింది. ఆ సమయంలో కేవలం మెదక్, మహబూబ్నగర్ స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత జరిగిన 2014 లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ 11 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చింది. ఇక రెండసారి కూడా 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2019 ఎన్నికల్లో 16 స్థానాలు టార్గెట్గా బరిలో దిగింది. కానీ,.. అనుకున్నన్ని సీట్లలో కాకుండా కేవలం 9 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు సాధించి అధికారాన్ని కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈ ప్రభావం ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికలపై పడటంతో కనీసం ఒక్క స్థానం గెలవలేక నిరాశలో కుంగిపోయింది.
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారాన్ని సాగించింది. పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ 16 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించారు. కేటీఆర్, హరీష్రావులు కూడా పెద్ద ఎత్తున ప్రచార సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే రెండవ స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ స్థానంలో అయితే నాలుగవ స్థానంలోకి పడిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే.. ఆదిలాబాద్, భువనగిరి, చేవెళ్ళ, కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజిగిరి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, పెద్దపల్లి నల్గొండ, నిజామాబాద్, సికింద్రాబాద్, వరంగల్, జహీరాబాద్ లోక్ సభ స్థానాల్లో మూడవ స్థానానికి పరిమితం అయింది. ఎనిమిది స్థానాల్లో అయితే డిపాజిట్లు కూడా కోల్పోయింది. అలాగే ఓటింగ్ శాతాన్ని కూడా భారీగా కోల్పోయింది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 41.29 శాతం ఓట్లు పోలవగా.. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో 16.70 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే కాంగ్రెస్ ఓటింగ్ శాతం చూసుకుంటే,.. 2019లో 29.48 శాతం ఓట్లు రాగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 40.11 శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే బీజేపీకి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 19.45 శాతం ఓట్లు రాగా,.. ఇప్పుడు 35.01 శాతం పోలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టాలనుకున్న గులాబీ పార్టీ ఆశలు అడియాశలు కావడంతో లోక్సభ ఎన్నికల్లో అయినా గెలిచి సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. అయితే, సీన్ రివర్స్ అయింది. ఈసారి మరింత పరాభవాన్ని మూట కట్టుకుని తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. తాము కచ్చితంగా గెలుస్తామనుకున్న మెదక్లోనూ మూడవ స్థానానికి పరిమితంకావడంతో గులాబీ పార్టీలో పోస్టుమార్టం జరుగుతోంది. కనీసం మూడు నుండి నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామని వేసుకున్న లెక్కలు తారుమారయ్యాయి. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం జరుగుతోంది. తమ ఓట్లన్నీ బీజేపీకి బదిలీ అయి ఉంటాయని భావిస్తోంది గులాబీ దళం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో బీజేపీకే మళ్లి ఉంటాయని అంతర్గత చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ మూడవ స్థానంలో ఉండటానికి కారణమిదేనన్న టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం దక్కకపోవడంతో గులాబీ క్యాడర్ నైరాశ్యంలో వుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చిన షాక్ నుండి బీఆర్ఎస్ తేరుకుని తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందా లేదా లేదా అన్నది వేచి చూడాలి.


