- బీజేపీ-హిందూసేన పిటీషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
- ఒక డాక్యుమెంటరీ దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందన్న ధర్మాసనం
- నిషేధం కోరుతూ హిందూ సేన చీఫ్ విష్ణుగుప్తా పిటిషన్
- విచారణార్హత అంశాలు లేవని కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన ఉన్న బీబీసీ డాక్యుమెంటరీపై పూర్తి స్థాయి నిషేధం విధించాలన్న బీజేపీ-హిందూ సేన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. డాక్యుమెంటరీలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన పలు ఆరోపణల ప్రస్తావన ఉంది. డాక్యుమెంటరీ పూర్తిగా నిషేధించాలన్న భావన తప్పుడు ఊహ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక డాక్యుమెంటరీ దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.. అని ధర్మాసనం ప్రశ్నించింది.
హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా బీబీసీ డాక్యుమెంటరీని దేశంలో ప్రదర్శించకుండా నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డాక్యుమెంటరీ విషయంలో పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఇద్దరు సభ్యుల ధర్మాసనం నిలదీసింది. మేము స్పెన్సార్షిప్ పెట్టాలను కుంటున్నరా.. అని పిటిషనర్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

పిటిషనర్ తరఫున వాదన సందర్భంగా బీబీసీ ఉద్దేశపూర్వకంగానే భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తోందని సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ ఆరోపించారు. డాక్యుమెంటరీ వెనుక కుట్ర ఉందని దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ – ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని పిటిషనరు కోరారు. భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుంటే… ప్రధాని మోదీ ప్రపంచనేతగా ఎదగడాన్ని సహించలేక కొందరు చేస్తున్న కుట్రలో భాగమే ఈ డాక్యుమెంటరీ అని పిటిషనర్ పేర్కొన్నారు.
2002లో గుజరాత్ హింసాకాండకు సంబంధించి బీసీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఈ ఉదంతంలో మోదీని ఇరికించేందుకు జరిపిన కుట్ర. ఇది భారతకీర్తి ప్రతిష్టలను దెబ్బతీసే చర్యని, హిందూ మత వ్యతిరేక ప్రచారం అని కూడా పిటిషనర్ అభివర్ణించారు. వాదనలను తోసిపుచ్చుతూ.. పిటిషన్ పూర్తిగా తప్పుడు భావనతో దాఖలు చేసిందని.. విచారించాల్సిన అంశం ఏదీ పిటిషన్ లో లేదని.. ఇక ఎక్కువ సమయం వృథా చేయాల్సిన పనిలేదని అంటూ జడ్జీలు పిటిషన్ను కొట్టివేశారు.
ఇండియా- ద మోదీ క్వశ్చన్ శీర్షికతో బీబీసీ 2 భాగాలుగా రూపొందించిన సీరీస్.. గతనెలలో ప్రసారమైంది. జనవరి 21న కేంద్రం..తన ఎమర్జెన్సీ అధికారాలను వినియోగించుకుంటూ డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులను షేర్ చేసే, యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్టులను బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
డాక్యుమెంటరీపై సెన్సార్ షిప్ నిలిపివేయాలని కేంద్రాన్ని కోరుతూ ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్, న్యాయవాది ప్రశాంత భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం ఈ నెలారంభంలో కేంద్రానికి నోటీసులు జారీచేసింది.