స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న క్షేమంగా పులివెందులలోని తన ఇంటికి చేరుకున్నారు. కొద్దిరోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రంగన్నను ఈనెల 2న పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ ఆసుప్రతిలో చేర్పించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో రంగన్నను పులివెందులకు తీసుకువచ్చారు కుటుంబసభ్యులు.
కాగా వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి కావడంతో ఆయనకు 1+1 భద్రత కల్పిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకాను హత్య చేశారని కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం వివేకా కేసు కీలక దశకు చేరుకున్న క్రమంలో ప్రత్యక్ష సాక్షి రంగన్న అనారోగ్యానికి గురికావడం చర్చనీయాంశమైంది.