వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని అపార్ట్మెంట్లో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లారు. కిడ్నాప్, దాడితోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో BNS సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్విత్ 3(5) కింద వంశీపై కేసు నమోదైంది. ఇక, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన కేసులో A71గా ఉన్నారు వల్లభనేని వంశీ.
గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్న సత్యవర్థన్.. ఇటీవలె విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. విజయవాడ అదనపు డీసీపీ కృష్ణ, ఇతర సిబ్బంది హైదరాబాద్ వచ్చి వంశీని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో వంశీ మోహన్ను అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన సతీమణికి నోటీసులు ఇచ్చారు పోలీసులు.
మరికొన్నికేసుల్లోనూ వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలునులో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేశారాన్న కేసులో A2గా ఉన్నారాయన. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు వంశీ.
ఇక, వంశీ అరెస్ట్తో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నుంచి వంశీని నేరుగా భవనీపురం పీఎస్కు తీసుకువచ్చారు ఖాకీలు. ఆ తర్వాత మరో వాహనంలో అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే.. నందిగామ వద్ద వంశీ భార్యను పోలీసులు అడ్డుకొని ఆమె వద్ద ఉన్న మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణలంక పీఎస్లో వంశీని ప్రశ్నిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఆయన్నుంచి విలువైన సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు.. విజయవాడ కృష్ణలంక వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కృష్ణలంక పీఎస్కు వల్లభనేని వంశీ భార్య వచ్చారు. అయితే ఆమెను పోలీసులు స్టేషన్లోకి అనుమతించలేదు. దీంతో.. వంశీ సతీమణి, జగన్మోహన్రావు, అరుణ్కుమార్ను గేటు దగ్గరే నిలిపేశారు పోలీసులు. కనీసం లాయర్లని కూడా అనుమతించకుండా అడ్డుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు అన్నారు.
వల్లభనేని వంశీపై ఎవరు కేసు పెట్టారో పోలీసులు చెప్పడం లేదని అన్నారు ఆయన తరపు న్యాయవాది చిరంజీవి. వంశీపై ఎందుకు కేసు పెట్టారో కూడా చెప్పడం లేదన్నారు. తనను సైతం పోలీసులు లోపలికి అనుమతించడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను పోలీసులు పాటించలేదని తెలిపారు లాయర్ చిరంజీవి.