స్వతంత్ర, వెబ్ డెస్క్: రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు వినోద్ కుమార్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో 3.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఒక సౌత్ సెంట్రల్ రైల్వే కీలక విభాగాలలోనే 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇతర విభాగాల్లో ఇంకా అనేక ఖాళీలు ఉంటాయని వినోద్ కుమార్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి రాసిన లేఖలో పేర్కొన్నారు. రైల్వే శాఖలో ఉద్యోగాల ఖాళీల వల్ల ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోందని, దీని వల్ల పలు ప్రమాదాలు, అనర్థాలకు దారితీస్తోందని వినోద్ కుమార్ అన్నారు.
రైల్వే శాఖలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులు, సరుకుల రవాణా ద్వారా అధిక ఆదాయం సమకూరుస్తు కీలక పాత్ర పోషిస్తోందని వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు కొంత భాగం కర్ణాటక, మహారాష్ట్రలలో సౌత్ సెంట్రల్ రైల్వే సేవలు అందిస్తోందని ఆయన అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కీలకమైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, టికెట్ కలెక్టర్స్, స్టేషన్ మాస్టర్స్, లోకో మోటివ్ పైలట్స్, ట్రాక్ మెంటేనర్స్, టెక్నికల్ స్టాఫ్, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు. నిరంతరంగా రైల్వే ట్రాక్స్ ను , సిగ్నల్స్ లైటింగ్స్ ను పర్యవేక్షణ చేసేందుకు తగిన స్థాయిలో సిబ్బంది లేని కారణంగా ప్రమాదాలకు చోటు కలుగుతోందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.


