వేలమంది సైనికులు పిట్టల్లా రాలిపోయారు. ఆయుధాలు నిల్వలు కొవ్వొత్తుల్లా కరిగిపోయాయి. అమాయక ప్రజలు అనేకులు అసువులు బాశారు. ఇళ్లు, పెద్దపెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపో యాయి. ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన ప్రగతి ఫలాలు కళ్ల ముందే కనుమరుగైపోయాయి. అయినా ఆ విధ్వంసకాండకు ఇంకా తెరపడలేదు. ఐక్యరాజ్య సమితి వంటి ఘనత వహించిన సంస్థలు చేసేదేం లేక చేతులెత్తేస్తున్నవేళ.. సమీప భవిష్యత్తులో దానికి ముగింపు కనిపించడం లేదు కూడా! ఆ విధ్వంస కాండ మరేదో కాదు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. అది ఇవాళ్టితో రెండేళ్లు పూర్తిచేసుకొని మూడో ఏడులోకి అడుగుపెడుతోంది.
అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి తమ సరిహద్దుల దాకా విస్తరణకు ప్రణాళికలు రచిస్తూ పక్కలో బల్లెంలా తయారవుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా రోజులు ఆగ్రహంతో ఉన్నారు. ఉక్రెయిన్ను భాగస్వామ్య దేశంగా చేర్చుకునేందుకు నాటో పావులు కదపడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ ప్రయత్నాల్ని నిలువరించే ప్రణాళికల్లో భాగంగా.. తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతంలో రష్యన్ భాష మాట్లాడేవారిపై ఉక్రెయిన్ ప్రభుత్వం 2014 నుంచి మారణకాండకు పాల్పడుతోందని ఆరోపిస్తూ 2022 ఫిబ్రవరి 24న ‘ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్’ పేరుతో యుద్ధాన్ని ప్రారంభించారు. డాన్బాస్ విమో చనం, నాజీయిజం నిర్మూలన వంటివి తమ లక్ష్యాలని ఆయన ప్రకటించారు. కేవలం మూడు రోజుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా ఆక్రమించేస్తుందని.. యుద్ధం ఆరంభమైనప్పుడు పలువురు విశ్లేషకులు అంచనా వేశారు. కానీ రెండేళ్లు పూర్తయినా అది జరగలేదు.
శాంతి కోసం రష్యా, ఉక్రెయిన్ బృందాలు యుద్ధం ఆరంభంలో చర్చలు జరిపాయి. 2022 ఏప్రిల్లోనే ఓ తాత్కాలిక ఒప్పందానికి అవి చేరువగా వచ్చినా.. చివరి క్షణాల్లో చుక్కెదురైంది. తర్వాత చర్చలు జరగలేదు. భద్రతామండలి సహా ఐక్యరాజ్య సమితిలోనూ సయోధ్యకు అడుగులు పడలేదు. చర్చలకు తాము సిద్ధమేనని పుతిన్ చెబుతున్నారు. కానీ ఇప్పటికే తాము ఆక్రమించిన ప్రాంతాలను వెనక్కి ఇవ్వ బోమంటున్నారు. నాటో దేశాలు ఉక్రెయిన్కు సాయాన్ని నిలిపివేస్తే యుద్ధం రెండు వారాల్లో ముగుస్తుం దని ఇటీవల పుతిన్ చెప్పారు. కీవ్కు సహాయం అందించేందుకు ఉద్దేశించిన బిల్లు అమెరికా కాంగ్రెస్లో స్తంభించిపోవడం ఇప్పుడు రష్యాకు అనుకూలంగా మారింది.