స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మొట్టమొదటి ఆదర్శనీయ పాత్రికేయుడు దేవర్షి ‘నారద మహర్షి’ జయంతి వేడుకలు సమాచారభారతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని FTCCI ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సమాచారభారతి అధ్యక్షులు డాక్టర్ జి.గోపాలరెడ్డి మాట్లాడుతూ యువ పాత్రికేయులకు విలువలతో కూడిన జర్నలిజంపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పౌరపాత్రికేయుల సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సమాచారభారతి ద్వారా నిర్వహిస్తున్నామనిపేర్కొన్నారు. మానవజాతికి ఉపయోగపడే జ్ఞానం అందించే మాధ్యమంగా నారద మహర్షి పనిచేశారని గోపాలరెడ్డి వెల్లడించారు.
మే30, 1826వ సంవత్సరం కలకత్తాలో ప్రారంభమైన ఉద్దండ్ మార్తాండ్ పత్రిక ‘నారద మహర్షి’ ముఖచిత్రంతో ప్రచురితం అయిందని ప్రముఖ జాతీయ పత్రిక ‘ఆర్గనైజర్’సంపాదకులు శ్రీ ప్రఫుల్ల కేత్కర్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నారదుడిని పత్రికా రంగ ఆద్యునిగా కనుమరుగు చేశారని వాపోయారు. పాత్రికేయులు నారద సూత్రాలలోని 75,76,77వ సూత్రాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సరైన వ్యక్తిని సరైన ప్రశ్నలు అడగటం, సరైన సమయంలో వార్తలు ఇవ్వడం ఆదర్శంగా తీసుకోవాలని కేత్కర్ హితవుపలికారు.
సీనియర్ పాత్రికేయులు శ్రీ రమావిశ్వనాథ్ గారిని ‘వడ్లమూడి స్మారక పురస్కారం’తో సత్కరించగా.. శ్రీ సామవేదం జానకీరామశర్మ గారిని ‘భండారు సదాశివ రావు’ స్మారక పురస్కారంతో సన్మానించారు. ‘సమాచారభారతి కాలమిస్ట్’ పురస్కారం కాలమిస్ట్ శ్రీ శ్యామసుందర్ గారికి, ‘సమాచారభారతి యువపురస్కారం’ యువ పాత్రికేయులు శ్రీ కొంటు మల్లేశం గారికి అందజేశారు.
మహతి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సమాచారభారతి సభ్యులు వేదుల నరసింహం, రాంపల్లి మల్లికార్జున, దుర్గారెడ్డి, రాజగోపాల్, సమాచారభారతి కార్యదర్శి ఆయుష్ నడింపల్లి తదితరులు పాల్గొన్నారు.