స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ మొక్కలు నాటనున్నారు. కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, కలెక్టర్ హరీష్, సీపీ సత్యనారాయణ పర్యవేక్షించారు. హరిత దినోత్సవంలో భాగంగా అన్ని అర్బన్ పార్కులకు ఉచిత ప్రవేశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. కాగా, రేపు ఒక్కరోజు 25 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మొక్కలను నాటేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 40 రకాల మొక్కలను ఇప్పటికే అందుబాటులో ఉంచామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు ఇస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించే హరితోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పుడమి పులకించేలా.. ప్రకృతి పరవశించేలా పెద్దఎత్తున మొక్కలను నాటాలని సూచించారు. అదేవిధంగా అటవీ శాఖ ఆద్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనం పెరగడానికి చేసిన కృషి, వాటి ఫలితాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఇక రవీంద్రభారతిలో నిర్వహించే కార్యక్రమంలో అడవుల పరిరక్షణకు విశేష కృషిచేసిన అటవీ అధికారులు, సిబ్బందిని సన్మానించి, అవార్డులు అందజేస్తారని పేర్కొన్నారు.