అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణస్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం రాత్రి పదిన్నర గంటలకి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు సైనిక విమానంలో చేరుకున్నారు. నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేతసౌధాన్ని ట్రంప్ వీడారు. ఈసారి ప్రపంచదేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్దసంఖ్యలో నిరసనకారులు వాషింగ్టన్లో ప్రదర్శన నిర్వహించనున్నారు. వారంతా ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు. తొలిసారి ఆయన అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ తరహాలోనే నిరసనలు వ్యక్తమయ్యాయి.
పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఆ మేరకు సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు 15 వందల మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటివాటిని తొలిరోజే మొదలుపెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్లను నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారే 15వేల మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. పలు దేశాలపై అదనపు సుంకాల విధింపుపైనా నూతన అధ్యక్షుడు నిర్ణయం తీసుకోనున్నారు. బైడెన్ అధ్యక్షుడైన తొలివారంలో 22 ఉత్తర్వులపై సంతకాలు చేశారు.
బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ త్వరలో చైనాతోపాటు భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. తన సలహాదారులతో దీనిపై చర్చలు జరిపినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరికొద్ది నెలల్లో వైట్హౌస్లో జరిగే ప్రభుత్వాధినేతల సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ట్రంప్ ఆహ్వానించే అవకాశముంది. ట్రంప్ ప్రమాణం చేసే వేడుకకు చైనా తరఫున ఉపాధ్యక్షుడు హన్ ఝెంగ్ హాజరవుతారు. చైనా ఇలా పంపడం ఇదే తొలిసారి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్నే ట్రంప్ ఆహ్వానించారు. విదేశీ నేతల ప్రమాణ వేడుకకు ఎన్నడూ హాజరుకాని జిన్పింగ్ తన బదులు ఉపాధ్యక్షుడిని పంపిస్తున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకానున్నారు
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణకు ఒక రోజు ముందు వాషింగ్టన్లో మేకి అమెరికా గ్రేట్ అగేన్ పేరుతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఉక్రోయిన్లో యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో గందరగోళ పరిస్థితులకు ముగింపు పలుకుతానని చెప్పారు. మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా శాంతిని నెలకొల్పుతానన్నారు ట్రంప్.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం సోమవారం జరగనుండగా, ఒక రోజు ముందుగా ఆయన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ కలిశారు. ట్రంప్ ఇచ్చిన క్యాండిల్లైట్ డిన్నర్కి ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రముఖులనే ఆహ్వానించారు. ఇందులో అంబానీ దంపతులు ఉన్నారు. మన దేశం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయులు అంబానీ దంపతులు మాత్రమే. అమెరికా ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన జేడీ వాన్స్, ఉషా వాన్స్లను కూడా వీరు కలిశారు. నేడు జరగనున్న అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కుటుంబం నుంచి అంబానీ దంపతులకు ఆహ్వానం అందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వేడుకకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు, రాజకీయ నాయకులు, విదేశీ ప్రముఖులు, సెలెబ్రిటీలు హాజరు కానున్నారు.