ఫిబ్రవరి నెల ముగిసింది. మార్చిలోకి అడుగుపెట్టాము. ఇక ఎండాకాలం మొదలైంది. ప్రతి ఏడాది శివరాత్రితో శివశివా అంటూ చలి పోతుందని.. వేసవికాలంలో అడుగుపెట్టినట్టేనని చెబుతారు. ఇక ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఎండలకు మాడుపగలగొట్టుకోవడానికి అందరూ సిద్దంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. ఈ ఏడాది ఎప్పటి కన్నా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందట. వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతారణ శాఖ హెచ్చరించింది.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండకు బెంబేలెత్తిపోవాల్సిందే. ఆ రెండు నెలల్లో ఈ ఏడాది 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
1901 నుంచి 2025 వరకు సరాసరి సగటు తీసుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే రెండు డిగ్రీలు పెరిగే సూచనలున్నాయట. 125 సంవత్సరాల సరాసరి సగటు తీసుకుంటే గాలిలో తేమ చాలా తగ్గిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.