గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారా? అదను కోసం వేచి చూస్తున్న కూటమి ప్రభుత్వానికి వంశీనే ఛాన్స్ ఇచ్చారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. విజయవాడ ఎంపీగా, గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ బీఫామ్స్ తీసుకున్న వంశీకి.. ఇప్పుడు అదే పార్టీ శత్రువులా మారింది. ఏ రాజకీయ పార్టీ నుంచి అయితే పొలిటికల్ కెరీర్ స్టార్ చేశాడు.. ఇప్పుడు అదే పార్టీ వంశీపై పీకల దాకా కోపంతో ఉంది. 2019లో టీడీపీ బీ ఫామ్పై గెలిచిన వంశీ.. ఆ వెంటనే వైసీపీకి జై కొట్టారు. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా మారాడు. అయితే జగన్కు మరింత దగ్గరవ్వాలన్న ఆలోచనో.. మరొకటో కానీ.. తన మాతృపార్టీ టీడీపీపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని చట్టపరంగా అతడిని అరెస్టు చేసే అవకాశం లేదు. దీంతో కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు అదను దొరుకుతుందా అని ఓపికగా ఎదురు చూసింది. పలు కేసుల్లో వంశీ ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడంతో కూటమి ప్రభుత్వం అరెస్టును లైట్ తీసుకుంది. అయితే వైసీపీ దారుణంగా ఓడిపోయి.. కూటమి అత్యంత బలంగా ఉన్న సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన వంశీ.. కొన్ని తప్పులు చేసి అడ్డంగా దొరికిపోయారని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే వంశీ ఇంటిపై దాడి జరిగింది. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసును కూటమి ప్రభుత్వం తిరగదోడింది. 2023లో ఈ దాడి జరుగగా.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వంశీ, ఆయన అనుచరుల పేర్లు నిందితుల జాబితాలో చేర్చినట్లు తెలిసింది.
అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. దీంతో వంశీని అరెస్టు చేసేఅవకాశమే లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో సైలెంట్గా ఉండాల్సిన వంశీ.. పెద్ద తప్పు చేశారు. అసలు ఆ కేసే లేకుండా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారట. అందుకే ఈ కేసులో ఫిర్యాదుదారునిగా ఉన్న సత్యవర్థన్ను కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. కిడ్నాప్ చేసి బలవంతంగా కేసు విత్ డ్రా చేయించారనేది ప్రధాన ఆరోపణ. దీంతో వంశీపై కిడ్నాప్ కేసు నమోదు అయ్యింది. ఇదే వంశీ చేసిన అతిపెద్ద తప్పని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఆ కేసును అలా వదిలేసినా పెద్దగా ప్రభావం ఉండేది కాదని.. కానీ కిడ్నాప్ కేసు ఇప్పుడు వంశీ మెడకు చుట్టుకుందని చెబుతున్నారు. దీన్ని సాకుగా చూపి ముందస్తు బెయిల్ కూడా రద్దయిపోయే ప్రమాదం ఏర్పడి.. చివరకు అరెస్టు వరకు చేరుకుందని అంటున్నారు.
తాను సత్యవర్థన్ను కిడ్నాప్ చేయలేదని.. అతనే స్వచ్ఛంధంగా కేసును ఉపసంహరించుకున్నాడని వంశీ వాదిస్తున్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని టీడీపీ విడుదల చేసింది. వాటిని చూపించి సత్యవర్థన్ను వంశీ బెదిరించారని టీడీపీ వాదిస్తోంది. ఇది తప్పకుండా కోర్టులో చెల్లుతుందని.. వంశీకి కారాగారం తప్పదని టీడీపీ చెబుతోంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసును మొత్తానికే మూయించేయాలని వంశీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టి.. చివరకు జైలుకు వెళ్లే పరిస్థితి దాపురించిందని అంటున్నారు.
ఒకవైపు టీడీపీ హిట్ లిస్టులో వల్లభనేని వంశీ ఉన్నాడు. ఆ విషయం వంశీకి కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం ఏ చిన్న ఛాన్స్ వచ్చినా తనను వదిలి పెట్టదని కూడా వంశీకి ముందు అర్థం అయ్యింది. ఇంత తెలిసినా వంశీ ఎందుకు ఇంతటి భారీ స్టెప్ తీసుకున్నారనేదే ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన వంశీ.. ఇలా కిడ్నాప్ కేసులో చిక్కుకోవడం అంటే.. తన గోతిని తాను తవ్వుకున్నట్లే అనే టాక్ వినిపిస్తోంది. అయితే వంశీపై ఈ ఒక్క కేసుతోనే ఆపేస్తారా అనేది కూడా అనుమానంగానే ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు వంశీ మెడకు చుట్టుకున్నా ఆశ్చర్యం లేదు. ఒక కేసులో బెయిల్ వచ్చినా..మరో కేసులో ఇరికించి.. సుదీర్ఘకాలం జైలుకే పరిమితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
ఏదేమైనా అధికారంలో లేనప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలను వంశీ మరిచిపోయారని.. తన అతివిశ్వాసంతో చేసిన తప్పే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందని అంటున్నారు. మరి వంశీకి ఈ కేసుల బెడద ఎప్పుడు తీరుతుందో వేచి చూడాలి.