కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే గుదిబండలా మారాడా? ఎమ్మెల్యేల బలం పెరుగుతుందని పార్టీలో చేర్చుకుంటే.. ఇప్పుడు పార్టనే ఓడించే స్కెచ్చులు వేస్తున్నాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజార్టీతో గెలిచింది. దీంతో పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దీనికి తోడు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో.. నగర పరధిలోని ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి కాంగ్రెస్ అసక్తి చూపించింది. ఈ క్రమంలోనే దానం నాగేందర్, ప్రకాశ్ గౌడ్, ఆరికేపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డిలను పార్టీలో చేర్చుకున్నారు. అయితే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రాకతో అక్కడ గ్రూపిజం మరింతగా పెరిగిపోయింది. అంతే కాకుండా పటాన్చెరు కాంగ్రెస్లో నిత్యం ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది.
పార్టీని బలోపేతం చేస్తాడని మహిపాల్ రెడ్డిని చేర్చుకుంటే.. ఇప్పుడు ఆయన ఏకంగా పార్టీకే గుదిబండగా మారాడట. నిత్యం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా.. అధిష్టానం మాటకు కూడా ఎదురు తిరుగుతున్నట్లు తెలిసింది. మహిపాల్ రెడ్డి చేరిన దగ్గర నుంచి పటాన్చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీని నాశనం చేయడానికే మహిపాల్ రెడ్డి వచ్చారంటూ శ్రీనివాస్ గౌడ్ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మహిపాల్ మాత్రం శ్రీనివాస్ గౌడ్ మాటలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. అదే సమయంలో తనను పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆగ్రహంతో ఉన్నారట.
పటాన్చెరులో గత నెల కాంగ్రెస్ నాయకుల మధ్య పెద్ద గొడవే జరిగింది. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం లేదని.. క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టలేదని పార్టీ శ్రేణులు గొడవకు దిగాయి.ఈ నేపథ్యంలో పీసీసీ కమిటీ వేసి మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్లను గాంధీ భవన్కు పిలిపించి మాట్లాడాయి. అప్పటి నుంచి పటాన్చెరు కాంగ్రెస్లో కాస్త ఘర్షణ వాతావరణం తగ్గిందని అందరూ భావించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ తర్వాతే మహిపాల్ రెడ్డి తనదైన స్కెచ్ వేసినట్లు తెలిసింది.
పటాన్చెరు నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగంగా ఉంది. దీంతో ఈ నియోజకవర్గం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఆ ఎన్నిక జరుగుతుండటంతో.. మహిపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీపీ యాదగిరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోదరుడు మధుసూధన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇప్పుడీ అంశం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఆ పార్టీ అభ్యర్థి ఓట్లకు గండి కొట్టేలా మహిపాల్ రెడ్డి అనుచరుడు వ్యవహరించడం ఇబ్బందిగా మారింది.
మహిపాల్ రెడ్డి కావాలనే యాదగిరితో నామినేషన్ వేయించారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారట. వాస్తవానికి బీఆర్ఎస్ బరిలో లేకపోవడంతో పటాన్చెరులో ఆ పార్టీ ఓట్లను కాంగ్రెస్కు వేయిస్తారేమోఅని ఇన్నాళ్లూ మహిపాల్ రెడ్డిపై ఆశపెట్టుకున్నారట. కానీ ఇప్పుడు తానే స్వయంగా మరో అభ్యర్థిని రంగంలోకి దింపడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఆశలు వదులుకున్నారట. అయితే కాంగ్రెస్కు దూరం కావాలని నిర్ణయించుకున్న తర్వాతే మహిపాల్ రెడ్డి ఈ ఎత్తు వేశారనే టాక్ నడుస్తోంది. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి తిరిగి గులాబీ గూటికే చేరుకోవాలని మహిపాల్ భావిస్తున్నారట.
ఏదైమైనా మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఇమడలేకపోతున్నారట. అందుకే నిత్యం ఆ పార్టీ నాయకులతో విభేదాలు వస్తున్నాయట. ఇక తాను బీఆర్ఎస్కే వెళ్లిపోతున్నానని సంకేతాలు ఇచ్చేందుకే ఇలా తన అనుచరుడితో నామినేషన్ వేయించారనే టాక్ ఉంది. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.