రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను కేబినెట్కు అందజేస్తారు. కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ, శాసనమండలిలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఈ ప్రత్యేక సమావేశాలను ఒక్కరోజులోనే ముగించనున్నారు.
కులగణనలోని కీలక అంశాలపై చర్చించడానికి రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. కులగణన వివరాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ఉంటుందని సమాచారం. కులగణన ద్వారా బీసీల రిజర్వేషన్లు, ఎస్టీ వర్గీకరణ అంశాలను తేల్చడానికి రేవంత్ సర్కార్ జెట్ స్పీడ్తో ముందుకు సాగుతోంది. కులగణన నివేదిక, సామాజిక అంశాల వివరాలు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి అందాయి.
ఇది ఇలా ఉంటే.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ తమ నివేదికను రెడీ చేసింది. ఈ నివేదికపై సబ్ కమిటీ అధ్యయనం పూర్తయిన తరువాత..రేపు కేబినెట్ ముందుకు వస్తోంది. ఈ రెండు కమిటీల నివేదికలపై కేబినెట్లో చర్చించాక.. అసెంబ్లీలో ప్రవేశపెడతారు. వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకొని వర్గీకరణ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు.
రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినేట్ భేటీ అవుతుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు ఈ అంశాలపై చర్చించడానికి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభల్లోనూ బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై సభ్యులు చర్చిస్తారు. గత నెలలో మన్మోహన్సింగ్కు నివాళులు అర్పించడానికి ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ .. తరువాత ప్రోరోగ్ చేయలేదు. దీంతో అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపర్చడానికి గవర్నర్అనుమతి లేకుండానే సమావేశం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు దొరికింది. ఈ అంశంపై చర్చించాక అసెంబ్లీని వాయిదా వేస్తారు.
మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 15 నుంచి నిర్వహించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల తొలిరోజున గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం 17న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఒకట్రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించి, సభను వాయిదా వేస్తారని, పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ వంటివాటిని మార్చి రెండో వారంలో చేపడతారని తెలుస్తోంది.
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుందని చర్చ జరుగుతోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా ఇదే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో బడ్జెట్కు ఒక రోజు ముందుగాని, వెనుక గాని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.