ఏపీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి బరిలో దిగబోతున్నాయి. ఇందకు సంబంధించిన చర్చలు మూడు పార్టీల నేతల మధ్య జరిగాయి. ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లతో చర్చలు జరిపారు.
ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం కూడా పూర్తయింది. మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరిగింది. బీజేపీకి 4 ఎంపీ సీట్లు, ఆరు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్ర బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ 4 ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఇప్పుడు ఆ పార్టీ 7 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కూటమిలో జనసేన కూడా ఉండటం, ఇప్పటికే ఆ పార్టీకి 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో.. బీజేపీ అడిగినన్ని సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదని టీడీపీ నేతలు అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ… పాత మిత్రపక్షాలన్నింటినీ తిరిగి దగ్గర చేర్చుకొనే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా టీడీపీను తిరిగి ఎన్డీయేలో చేర్చుకోవాలని భావి స్తోంది. ఇప్పటికే బిహార్లో నీతీష్కుమార్, ఉత్తర్ప్రదేశ్లో ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధరిని ఎన్డీయేలో చేర్చుకుంది. ఇక, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ కూడా ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైంది. తాజాగా టీడీపీని కూడా ఎన్డీయేలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయేలో చేరికపై ఫిబ్రవరి 7న కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు ఓ దఫా చర్చలుజరిపారు. తాజాగా మరోసారి ఢిల్లీ వేదికగా చర్చల జరుపుతున్నారు.


