వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రెడీ అయింది. ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఈ భేటీలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 40 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి కూడా కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీఈసీ ఢిల్లీలో సమావేశమైంది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 60 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై సీఈసీ సుదీర్ఘ చర్చలు జరిపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. రేవంత్, భట్టి, ఉత్తమ్లతో ఎన్నికల కమిటీ చర్చలు జరిపింది. 17 సీట్లపై అభ్యర్థుల వివరాలను అందించారు రేవంత్. తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది.ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయా, లక్షద్వీప్కు సంబంధించి పలు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. సీఈసీ సమావేశంలో ఖర్గే, సోనియా గాందీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కేరళలో తమ పార్టీ 16 స్థానాల్లో పోటీ చేయబోతోందని కాంగ్రెస్ నేత వి.డి.సతీశన్ చెప్పారు. తమ మిత్రపక్షాలకు 4 స్థానాలు కేటాయించామన్నారు.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భుపేష్ బఘేల్ రాజ్నంద్గావ్ నుంచి, మాజీ మంత్రి తామ్రధ్వజ్ సాహూ మహసముంద్ నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థి త్వం సైతం ఖరారైంది. రాహుల్ గాంధీ వయనాడ్తోపాటు ఉత్తరప్రదేశ్లోని ఆమేథీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాయ్బరేలీ నుంచి ఈసారి ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నట్లు తెలు స్తోంది. 2019 నాటి ఎన్నికల్లో ఆమేథీ నుంచి ఓడిపోయిన రాహుల్ గాంధీ వయనాడ్లో గెలిచారు. తొలి జాబితాను త్వరలో అధికారికంగా విడుదల చేస్తామని కాంగ్రెస్ తెలిపింది.