రుతుక్రమ సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై చర్చించిన ధర్మాసనం.. ఈ సెలవులు ప్రభుత్వ విధానానికి సంబంధించినవి అని స్పష్టం చేసింది. అందులో కోర్టు జోక్యం చేసుకోలేదని… రాష్ట్రాలను సంప్రదించి రుతుక్రమ సెలవుపై నమూనా విధానాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ సెలవులకు తాము అనుమతి మంజూరు చేస్తే, అది మహిళలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అంతేకాదు, వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి సంస్థల యజమాన్యాలు ఇష్టపడకపోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్రాలు, ఇతర భాగస్వామ్యదారులతో చర్చించి కేంద్రమే ఒక విధానం రూపొందించాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు నెలసరి సెలవులు మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్పై విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.