రచయిత్రి, సామాజిక కార్యకర్త సుధామూర్తిని రాజ్యసభ సభ్యురాలిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. సుధామూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను పెద్దల సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని మోదీ కొనియాడారు.
రచయిత గానే కాక, సామాజిక సేవ, దాతృత్వం, విద్యారంగాలకు విశేష కృషి చేసిన సుధా మూర్తి 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో రచనలు చేశారు. 1950 ఆగస్టు 19న కర్ణాటక లోని శిగ్గావున్ లో జన్మించిన సుధామూర్తి బివి భూమరద్ది కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్
విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి సుధామూర్తి. టెల్కో కంపెనీలో మహిళా ఇంజనీర్ గా కెరియన్ ప్రారంభించారు. ఆ సంస్థ పుణే బ్రాంచ్ లో పనిచేస్తుండగా నారాయణ మూర్తితో పరిచయం, వివాహం.. తర్వాత ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటులో కీలక పాత్రవహించారు. నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడుగా ఉంటే.. సుధా మూర్తి డైరెక్టర్ గా పనిచేశారు. వారికి కుమార్తె అక్షిత మూర్తి, కుమారుడు రోహన్ మూర్తి ఉన్నారు. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ సుధామూర్తి అల్లుడే. అక్షత మూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. దాతృత్వం, సేవా రంగంలో సుధామూర్తి చేసిన సేవలతో మన్ననలు పొందారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. పలు అనాధాశ్రమా లను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి సహకరిస్తున్నారు. కర్ణాటకలో చాలా ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి, పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య ఉచితంగా అందేలా కృషి చేశారు. కంప్యూటర్ సైన్స్ టీచర్ గా కూడా పనిచేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఐఐటీ కాన్పూర్ లోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఉన్న హెచ్ ఆర్ కాదిం దివాన్ బిల్డింగా ఏర్పాటుకు, నారాయణ్ రావ్ మెల్గిరి స్మారక లా కాలేజీకి పెద్దగా విరాళం ఇచ్చారు. మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగాపలు సేవలు అందిస్తున్నారు.
ప్రధాని మోదీ తన ట్వీట్ లో సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకం అని అన్నారు. సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ అవడం నారీశక్తికి బలమైన నిదర్శనం అని చెప్పారు. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ అని తెలిపారు. సుధామూర్తి పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.