తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో బేగంపేట విమానా శ్రయంలో భేటీ చర్చనీయాంశం అయింది. గురుశిష్యులుగా చెప్పుకునే రేవంత్, చంద్రబాబు ఏం చర్చించారు. బీజేపీ తో దోస్తీ కోసం ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబుతో ఆ పార్టీకి చుక్కెదురైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయని చర్చనీయాంశం అయింది. ఉభ యులూ వ్యతిరేకించే ఏపీ సీఎం జగన్ ప్రస్తావన చర్చల్లో వచ్చిందా.. చర్చించిన అంశాలేమిటి.. ఇదో సస్పెన్స్
ఆయన తెలంగాణ ప్రస్తుతం సీఎం.. ఈయన ఏపీ మాజీ సీయం.. ఒకప్పుడు గురు శిష్యులు. బేగంపేట విమానాశ్ర యంలో కలిశారు. దాదాపు రెండు గంటలపాటు కబుర్లాడుకున్నారు. ఇంతకీ ఏం చర్చించారన్నది కోటి డాలర్ల ప్రశ్న. చంద్రబాబునాయుడు,రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 3.30గంటల నుంచీ 5.30గంటల వరకూ సమావేశమై నట్లు తెలిసింది. పూర్వాశ్రమంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పదవీ బాధ్యతలు కూడా నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వేర్వేరు పనుల మీద వేర్వేరు ప్రైవేట్ విమానాల్లో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వీరిద్దరూ తారసపడ్డారు. ఓ రెండుగంటలపాటు సంభాషించుకున్నారు. తెలంగాణ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిసి సంభాషణలు జరపడం ఇదే ప్రథమం.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా పిలుపు మేరకు ఎన్డీఏలో చేరే విషయం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ – బిజేపీ సీట్ల పంపిణీ వంటి విషయాలపై చర్చించేందుకు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ కి వెళ్లేందుకు బేగంపేట వచ్చారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ , వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ తో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం రాత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తు విషయం చర్చించి నట్లు తెలిసింది. కాగా, ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మరో విమానంలో గురువారం బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులను కలిసేందుకు గురువారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీతో అలయన్స్ పై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తున్న తన గురువు చంద్రబాబుతో ఏం చర్చించి ఉంటారన్నది చర్చనీ యాంశం అయింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు వేర్వేరు రాజకీయ పార్టీలైన ఎన్డీయే, ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయంగా ఉద్రిక్త పరమైన వాతావరణం నెల కొన్న పరిస్థితుల్లో రాజకీయంగా ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలతో సన్నిహితంగా మెలిగిన ఈ ఇద్దరు నేతలు ఎలా కలుసుకోగలరన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
రేవంత్ రెడ్డి తెలుగుదేశం లో ఉన్ననాటి నుంచి ఆయనకు చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయి. ఆయన నిర్ణయాలు, వ్యూహాలు చంద్రబాబు మాదిరిగా ఉంటాయనే టాక్ ఉంది. రాష్ట్రవిభజన తర్వాత.. ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ లో చేరారు. అలాగే తనతో పాటు టీడీపీలో ఉన్న సీతక్క, చాడా సురేష్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి లనూ కాంగ్రెస్ పార్టీలో చేర్చి..కీలక పదవులే కట్టపెట్టారు. రేవంత్ – చంద్రబాబు భేటీ విషయం బీజేపీకి తెలుసా.. వారి భేటీ బీజేపీ కనుసన్నల్లోనే జరిగిందా.. ఈ నాయకుల భేటీ తర్వాత పరిణామాలు ఏమిటి.. చూడాల్సి ఉంది.