మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్కు మంచి స్పందన లభిస్తోంది. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేశ్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి అందిన సమస్యలను విభాగాల వారీగా సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందిని ఆదేశించారు.
దివ్యాంగులకు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకో వాలని గుంటూరుకు చెందిన ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేశ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. తమకు మంజూరు చేసిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురిచేసిందని చెప్పారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ సొంతింటి కల నెరవేరేలా టిడ్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని కోరారు. సమస్యను విన్న మంత్రి చర్చించి నిర్ణయం తీసుకుంటామ న్నారు. తన కుమార్తెకు పూర్తిస్థాయి అంగవైకల్యం ఉందని, దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ బానుబీ కోరారు. నులకపేటకు చెందిన ఆంజనేయులు దివ్యాంగ పింఛన్ కోసం లోకేశ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన వంశీకృష్ణ కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ వారికి భరోసా ఇచ్చారు.