తెలంగాణలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. రాష్ట్రంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో జనాలపై కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లలతోపాటు పెద్దవారిపై కూడా కుక్కలు దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. తాజాగా కుక్కల దాడి చేయడంతో మరో బాలుడికి తీవ్ర గాయా లయ్యాయి. సంగారెడ్డి జిల్లా శ్రీనగర్కాలనీలో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిని వీధికుక్కలు చుట్టుముట్టి దాడి చేశాయి. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడికి చేరుకుని కుక్కలను తరిమివేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కల దాడులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.