పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో పోలీసు అధికారుల పాత్ర, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సిట్ కూపీ లాగుతోంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది. ఎన్ని కల సంఘం ఆదేశాల మేరకు 17వ తేదీన సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. ఇంటెలిజెన్స్ ఐజీ వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో 13మంది అధికారులతో ఏర్పాటైన సిట్ నాలుగు బృందాలుగా విడిపోయి ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తోంది.
పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. అధికార పార్టీకి వంతపాడిన దిగువ, మధ్య స్థాయి పోలీసు అధికారుల పాత్రపై విచారణ చేస్తున్నారు. టీడీపీ నేతలు, వైసీపీ నేతలు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా, ఆస్తులను ధ్వంసం చేస్తున్నా ఆపకుండా ప్రేక్షకపాత్ర పోషించిన అధికారులు ఎవరు.. ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా అధికార పార్టీ నేతలకు సమాచారం చేరవేసిన పోలీసులెవరు.. అన్న కోణాల్లో విచారిస్తున్నారు. సీడీ ఫైల్ తీసుకురండి. ఎఫ్ఐఆర్లో ఏయే సెక్షన్లు వేశారు..ఎవరెవరిని అరెస్టులు చేశారు..వచ్చిన ఫిర్యాదులేంటి.. దర్యాప్తులో లభించిన ఆధారాలేంటి? అంటూ సిట్ అధికారులు.. స్థానిక పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
ఇక అనంతపురం జిల్లా తాడిపత్రికి ఒంగోలు ఏసీబీ డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం వెళ్లింది. దశాబ్దాలుగా ఇక్కడ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారా. పోగుచేసిన రాళ్ల గుట్టలను ముందుగానే ఎందుకు పసిగట్టలేకపో యారు.. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్పైనే రాళ్ల వర్షం కురిపించేంతంటి హింసను ఎందుకు అదుపుచేయలేక పోయారు. గతంలో ఇక్కడ పనిచేసి వివాదానికి కేంద్ర బిందువైన డీఎస్పీ చైతన్యపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవమెంత? అనే కోణాల్లో పరిశీలిస్తోంది. సిట్ బృందంలో డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావుతో పాటు ఏసీబీ డీఎస్పీ భూషణం, ఏసీబీ ఇన్స్పెక్టర్ జీఎల్ శ్రీనివాస్ ఉన్నారు.
తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఐజీ షిమోషీతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఇళ్ల వద్ద జరిగిన హింసాత్మక ఘటనల గురించి అడిగినట్లు సమాచారం. పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై ఆరా తీసినట్లు తెలిసింది. అనంతరం ఎన్నికల రోజు దాడులు జరిగిన ఓం శాంతినగర్, పాతకోట, గాను గవీధి ప్రాంతాల్లో పర్యటించారు. గొడవల గురించి స్థానికులను విచారించారు. అనంతరం ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ నివాసాలను పరిశీలించారు. ఇరువర్గాలు గొడవపడ్డ కళాశాల మైదానంలో కలియ తిరిగారు. రాళ్లదాడి ఏ విధంగా జరిగిందో అక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు సిబ్బందితోనూ మాట్లాడారు. వారివెంట తాడిపత్రి రూరల్ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, ఎస్ఐ గౌస్బాషా ఉన్నారు. నాలుగు ప్రాంతాల్లోనూ సిట్ బృందాలు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాయి. ఆదివారం సాయంత్రానికి విచారణను దాదాపు ఓ కొలిక్కి తీసుకొస్తామని సిట్ అధికారులు పోలీసు ప్రధాన కార్యాలయానికి సమా చారం అందజేశారు. ఇప్పటికే 12 మంది అధికారులపై వేటు పడగా, మరికొందరి పాత్రను సిట్ వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.