ఎన్నికల్లో వరుస పరాజయాలతో గులాబీ పార్టీలో ఆందోళన మొదలైందా.? పార్టీ కిందిస్థాయి క్యాడర్ పార్టీ ని వదిలి వెళుతూ ఉండడంపై ఎమ్మెల్యేలు ఆ దిశగా ఆలోచనలు సాగిస్తున్నారా.? ఎమ్మెల్యేలను కాపా డుకోవడంపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారా..? ఎమ్మెల్యేలను ఫాం హౌజ్ కు పిలిచి కేసీఆర్ ఏం భరోసా ఇస్తున్నారు. అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..?
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు పెద్దలు. అదృష్టమైనా, దురదృష్టమైనా ఎవరినైనా పట్టుకుందంటే ఉడుం పట్టులాగే ఉంటుందని పెద్దలు చెబుతారు. ఈ పెద్దల వాక్కులు గమనిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఇలాదే ఉందేమో అనిపిస్తోంది. బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాకిచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలు పాతర వేశాయి. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ బీఆర్ఎస్ పరాజయం పాలైంది. పక్కాగా గెలుస్తామని భావించిన మెదక్ పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ ఓడిపోయింది. తాజాగా సిట్టింగ్ స్థానంగా ఉన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం లో సైతం బిఆర్ఎస్ ఓటమి చెందింది. ఇన్ని పరాభవాలు ఎదుర్కొన్న గులాబీ పార్టీలో ఇప్పుడు తీవ్ర గుబులు మొదైంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం దక్కక పోవడంతో బిఆర్ఎస్ లో అంతర్మథనం జరుగుతున్నట్టు
తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాలకు కేసీఆర్ కలత చెంది, పార్టీ ఫ్యూచర్ పై ఆందోళనకు గురైనట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ అధిష్ఠానం సమీక్షలు నిర్వహించలేదు. దీనిపై పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి ప్రక్షాళన చేసి, పూర్వవైభవం తేవాలని కార్యకర్తల నుం డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణలో రెండు సార్లు అధికారం చెలాయించిన గులాబీ బాస్ కెసిఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నజర్ పెట్టింది. బిఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలనే వ్యూహాలకు పదును పెడుతోంది.దీంతో బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డైలమాలో పడ్డారు.పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తే ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా కాపాడు కోవచ్చని భావించారు.ఇప్పుడుఫలితాలు వ్యతిరేకంగా రావడంతో కేసీఆర్ కు ఎమ్మెల్యేల టెన్షన్ పట్టు న్నట్టు తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక ఎమ్మెల్యే మృతి చెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీకి 35 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ప్రస్తుతం వీరిని కాపాడుకోవడం గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ కు సవాల్ గా మారింది. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవటం పైనే కేసీఆర్ దృష్టి సారించారు. ఫామ్ హౌస్ కు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను పిలిచి పార్టీ మారకుండా చర్చలు జరుపుతున్నట్లు టాక్. వరుస ఓటముల తో దెబ్బ మీద దెబ్బ తగులుతున్న బిఆర్ఎస్ తన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఎలా కాపాడు కుంటుందో, రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ ఫ్యూచర్ వ్యూహాలు ఏమిటో! అంతా భవిష్యత్తే చెప్పాలి.