తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ బృందం సింగపూర్ లో పర్యటించింది. అక్కడ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ ను సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవెలప్ మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించింది. అక్కడ శిక్షణను అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు.
అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. హైదరాబాదులోని ఫోర్ల్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
నైపుణ్యాల అభివృద్ధి శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారం అందించాలని కోరారు. ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పని చేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్ ను సందర్శించనుంది.
మరోవైపు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణంపై వారు చర్చించారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ భేటీలో పాల్గొన్నారు.