కేసీఆర్ కుటుంబం వల్ల చర్లపల్లి, చంచల్ గూడ జైల్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. 9ఏళ్లుగా కేసీఆర్తో ఒంటరిగా పోరాడుతున్నానని.. తనను జైలులో చిప్పకూడు తినిపించిన వారితో ఎందుకు లాలూచీ పడతానని కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లిన రేవంత్ అమ్మవారిపై ప్రమాణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈటల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే సర్వనాశనమైపోతానని రేవంత్ తెలిపారు. తుది శ్వాస వరకు కేసీఆర్ తో పోరాడుతూనే ఉంటానని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారం నుంచి దించడమే తన జీవిత లక్ష్యమన్నారు. లాలూచీ నా రక్తంలోనే లేదు.. భయం నా ఒంట్లోనే లేదని వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ-బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచాయని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి ఒక్క రూపాయి కూడా పంచకుండా పోటీచేశారన్నారు. ఇప్పటివరకు ఈటల రాజేందర్ పై సానుభూతి ఉండేదని.. కానీ ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.