స్వతంత్ర వెబ్ డెస్క్: దక్షిణ అమెరికాలోని కొలంబియాలో గల దట్టమైన అమెజాన్ అడవుల్లో అద్భుతం జరిగింది. నిత్యం క్రూర మృగాలు సంచరించే ఈ ప్రాంతంలో విమానం కూలిన 40 రోజుల తర్వాత 11నెలల పసిబిడ్డతో సహా నలుగురు పిల్లలు సజీవంగా ఉన్నారు. అమెజాన్ అటవీ ప్రాంతంలో చిక్కుకున్న వారిని సైన్యం, ఫైర్, రెస్క్యూ బృందాలు కాపాడాయి. దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఈ సంఘటన జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలోని అరారాక్యూరా నుంచి శాన్జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే ఒకటిన విమానం బయలుదేరింది. ఆ విమానంలో నలుగురు చిన్నారులు, వారి తల్లి, గైడ్, పైలట్ ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో సాంకేతిక సమస్యతో అది కూలబోతున్నట్లు పైలట్ ప్రకటించాడు. అనంతరం ఆ విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. ‘ఆపరేషన్ హోప్’ పేరిట దట్టమైన అడవుల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత మే 16న విమాన శకలాలను గుర్తించారు. అందులో పైలట్, చిన్నారులు తల్లి, గైడ్ మృతదేహాలను గుర్తించారు.
అయితే విమానంలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద స్థలంలో వారు కన్పించకపోవడంతో చిన్నారుల కోసం గాలించారు. దాదాపు 150 మంది సైనికులు, జాగీలాలతో అమెజాన్ అడవిని జల్లెడపట్టారు. ఈ క్రమంలోనే మే 18వ తేదీన పిల్లలు క్షేమంగానే ఉన్నారని తెలియజేసేలా చిన్నగుడారం, జుట్టుకు కట్టుకునే రిబ్బన్, పాలసీసా, సగం తిన్న పండు వంటివి కనిపించాయి. దీంతో పిల్లలు అడవుల్లోనే ఉన్నట్లు ధ్రువీకరించిన అధికారులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ఎట్టకేలకు, ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత చిన్నారులను సజీవంగా గుర్తించారు. గాలింపు బృందాలు వారి వద్దకు చేరుకునేసరికి నలుగురు పిల్లలు ఒంటరిగానే ఉన్నట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తెలిపారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే క్రూరమృగాలు తిరిగే ప్రాంతంలో ఇన్ని రోజులుగా ఆ చిన్నారులు తమను తాము ఎలా కాపాడుకున్నారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. గాలింపు సమయంలో భద్రతా సిబ్బంది అడవుల్లో అక్కడక్కడా హెలికాప్టర్ల సాయంతో ఆహార పదార్థాలు ఉన్న బాక్సులను పడేశారు. అవే చిన్నారులకు సాయం చేశాయని అధికారులు భావిస్తున్నారు.
ఇన్ని రోజుల తర్వాత చిన్నారులు సజీవంగా కన్పించడంతో కొలంబియాలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సైనికులతో చిన్నారులు ఉన్న దృశ్యాలను కొలంబియా మిలిటరీ ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘‘మా ప్రయత్నాలు ఫలించాయి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ‘‘ఈ అడవే వారిని రక్షించింది. వారు అడవి పిల్లలు. మా కొలంబియాకు కూడా వారసులే’’ అని ఆ దేశ అధ్యక్షుడు పెట్రో సంతోషం వ్యక్తం చేశారు.


