స్వతంత్ర వెబ్ డెస్క్: దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువలో రూ.500, రూ.2,000 నోట్ల విలువే 87.9 శాతమని ఆర్బీఐ వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. 2021- 22లో ఇది 87.1 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2023 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న నోట్లలో రూ.500 నోట్లే అధికంగా ఉన్నాయని.. వీటి వాటా 37.9 శాతంగా ఉందని తెలిపింది. తర్వాత రూ.10 నోట్లు 19.2 శాతంగా ఉన్నాయంది. మొత్తం 5లక్షల 16వేల 338 రూ.500 నోట్లు చలామణిలో ఉండగా.. వీటి విలువ రూ.25,81,690 కోట్లు అని చెప్పింది. ఇక 4,55,468 లక్షల రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా.. వీటి విలువ రూ.3,62,220 కోట్లుగా వివరించింది. అయితే గతేడాదితో పోలిస్తే రూ.2వేల నోట్ల సంఖ్య చలామణి 1.3 శాతం తగ్గినట్లు వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 విలువ చేసే నోట్లు చలామణిలో ఉండగా.. నాణేల విషయానికి వస్తే 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 చలామణిలో ఉన్నాయంది. ఇక కొత్త నోట్ల ముద్రణ 2021-22తో పోలిస్తే 2022-23లో 1.6శాతం పెరిగిందంది. అలాగే గత సంవత్సరంతో పోలిస్తే నకిలీ నోట్లు తగ్గాయని నివేదికలో పొందుపరిచింది.