స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిప్పులు చెరిగారు. ఏలూరులో జరిగిన వారాహి సభలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. వాక్ స్వాతంత్ర్యం ఉన్నది అభిప్రాయాలు చెప్పడానికి, భిన్నాభిప్రాయాలతో చర్చాకార్యక్రమాలతో వాదించడానికి అని స్పష్టం చేశారు. కానీ నిరాధార ఆరోపణలు చేయడానికి కాదని పవన్ కు హితవు పలికారు. రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కల్యాణ్ కు ఇది తెలియకపోవడం అతడి చదువులేనితనాన్ని నిరూపిస్తోందని విమర్శించారు.
ఏలూరు సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేస్తూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 17 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ కు వాలంటీర్ వ్యవస్థే కారణమని కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు.. గ్రామంలో ఎవరు ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, అందులో అమ్మాయిలు ఎంతమంది, వారికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా, వితంతువులు ఎంతమంది, మగవాళ్లకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అనే వివరాలను సేకరిస్తారని, వాలంటీర్ల ద్వారా ఆ వివరాలు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళుతున్నట్టు కేంద్ర నిఘా పెద్దలు తనకు చెప్పారని పవన్ వివరించారు. దాంతో ఆ సంఘ వ్యతిరేక శక్తులు అమ్మాయిలను ట్రాప్ చేసి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు తెలిసిందని పవన్ మండిపడ్డారు.


