Congress: కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర ఎంతో ఘనం.. సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన హస్తం పార్టీ.. ప్రస్తుతం నాయకత్వ లేమితో పాటు.. దేశ వ్యాప్తంగా కొంత బలహీనపడింది. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి.. నరేంద్రమోదీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఆ పార్టీ దేశ వ్యాప్తంగా మరింత బలపడుతూ.. ఎన్నికలు ఎక్కడ జరిగినా గెలుపు బావుటా ఎగరేస్తూ వస్తోంది. దాదాపు 9 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్నా.. ప్రజల్లో భారీ వ్యతిరేకత కూడగట్టుకోని నాయకుడిగా నరేంద్రమోదీ ఉన్నారు. ఇదే సమయంలో పూర్వ వైభవాన్ని సాధించాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో ఉంది హస్తం పార్టీ. అయితే ఓ వైపు అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వలేమితో కాంగ్రెస్ పార్టీ కొట్టిమిట్టాడుతోంది. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించడం, దేశ వ్యాప్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నా.. అనుకున్నంత ఆదరణ కాంగ్రెస్కు కనిపించడం లేదు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఓడిపోవడం, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించకపోవడంతో హస్తం పార్టీ పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని అంతా భావించారు. ఇదే సమయంలో తాజాగా రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో.. రాజకీయంగా ఎదుర్కోలేక.. కేంద్రప్రభుత్వం తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని బీజేపీ వేధిస్తోందని, ఆయన గొంతును లోక్సభలో వినపడనీయకుండా కుట్రకు పాల్పడిందంటూ దేశ వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఎన్నికల వరకు ఈ ఆందోళన కొనసాగించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇక ప్రజా సమస్యలన్నీ పక్కన పెట్టి.. రాహుల్ గాంధీ సమస్యనే ఎన్నికల ఎజెండాగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ గత ఎన్నికల సమయంలో కర్ణాటకలో జరిగిన ఓ సభలో మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తే చేసిన వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్లో నమోదైన పరువునష్టం కేసులో.. అక్కడి న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. క్షమాపణలు చెప్పడానికి.. ఆయన మాటలు వెనక్కి తీసుకోవడానికి నిరాకరించడంతో న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ విషయం మొత్తాన్ని గమనిస్తే అంతా చట్ట ప్రకారమే జరిగింది. కాని అసలు విషయానికోస్తే.. పరువునష్టం కేసులో రెండేళ్ల శిక్ష వేయడం ఏమిటి.. శిక్ష ఖరారు చేయడంతో లోక్సభ సభ్యత్వంపై అనర్హత పడటం ఏమిటనే చర్చ మొదలైంది. అలా అయితే బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు ఎలాంటి శిక్షలు వేయాలనే చర్చ ప్రారంభం అయింది. మరోవైపు కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. అప్పీలుకు వెళ్లేందుకు శిక్ష వేసిన న్యాయస్థానం నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ సందర్భంలో అనర్హత ఎందుకనే చర్చ జరిగింది.
వాస్తవానికి శిక్ష అమలుపై గాని, కోర్టు తీర్పుపై గాని స్టే రాలేదు. కేవలం తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు మాత్రమే గడువు ఇచ్చింది. దీంతో నిబంధనల ప్రకారం ఆయన లోక్సభ సభ్యుడిగా అనర్హుడిని చేస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కోర్టును నిందించే అవకాశం లేకపోవడంతో కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేసింది కాంగ్రెస్. బీజేపీ వ్యతిరేక పార్టీలన్ని రాహుల్ గాంధీ పట్ల సానుభూతిని ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టాయి. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే కేంద్రప్రభుత్వం కుట్ర పన్ని చేసిందా అంటే అవునని చెప్పలేం. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను సూరత్ కోర్టు విధించడంతో ఆయన తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ఎజెండాగా తీసుకున్నట్లు ఎన్నికల వరకు రాహుల్ గాంధీ అనర్హతకు నిరసనగా ఆందోళనలకు పిలుపునివ్వడంతో.. దేశ వ్యాప్తంగా రోజువారి నిరసను జరగడం చూస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా.. ఈ అంశం హస్తం పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందా అంటే రాజకీయ విశ్లేషకులు మాత్రం కొచెం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నది పార్టీలో ఓ వ్యక్తికి సంబంధించిన విషయాన్ని.. దీంతో ప్రజలకు వచ్చిన నష్టం పెద్దగా ఏమి లేదు. అది ప్రజా సమస్య కూడా కాదు. నోటి దురుసు కారణంగా రాహుల్ గాంధీ పరువునష్టం కేసు ఎదుర్కొవాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో చాలా మంది ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరినైనా తన మాటలు నొప్పించి ఉంటే క్షమాపణలు చెప్తారు. కాని తాను మాత్రం క్షమాపణలు చెప్పేదే లేదనడంతో రాహుల్ శిక్షను ఎదుర్కొవల్సి వచ్చింది. ఈ క్రమంలో దీనిని దేశ వ్యాప్త సమస్య చేస్తూ కాంగ్రెస్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తుందనే విషయం బహిరంగ రహస్యం. మరీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీని ఆదిరిస్తారా.. రాహుల్ అనర్హత వేటు అంశం కాంగ్రెస్కు ఓట్లు తెచ్చి పెడుతుందా అంటే మాత్రం ఎన్నికల ఫలితాలే దీనికి సమాధానం చెప్పాలి.