స్వతంత్ర వెబ్ డెస్క్: బిల్లులకు ఆమోదం విషయంలో రాష్ట్ర గవర్నర్ తీరు ఏమాత్రం మారలేదని మరోసారి రుజువయ్యింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ మానవీయ కోణంలో తీసుకొన్న నిర్ణయాన్ని గవర్నర్ నిర్దయగా అణగదొక్కుతున్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతించకుండా తాత్సారం చేస్తున్నారు. ఇప్పటికే పలు బిల్లులను కావాలనే కక్షపూరితంగా నెలలపాటు తొక్కిపెట్టిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai Soundararajan), ఇప్పుడు 43 వేల మందికిపైగా కార్మికుల కుటుంబాలతో ముడిపడి ఉన్న ఆర్టీసీ (RTC) బిల్లుపై కూడా అదే స్థాయిలో తాత్సారానికి తెరలేపారు. ఆర్టీసీనే నమ్ముకొని జీవితం గడుపుతున్న కార్మికుల కష్టాలు, నష్టాలు, కన్నీటిని అర్థం చేసుకుని సీఎం కేసీఆర్ ఒకే ఒక్క నిర్ణయంతో వాటన్నింటికీ చెక్ పెట్టారు.
TSRTC: గవర్నర్ చర్యపై ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం.. రాజ్భవన్ ముట్టడికి పిలుపు
ఆర్టీసీని సర్కారులో విలీనం చేయాలని క్యాబినెట్ సమావేశంలో తీర్మానించారు. దీంతో 43,373 మంది కార్మికుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో వెంటనే ముసాయిదా బిల్లును సిద్ధం చేయించారు. అది ద్రవ్య సంబంధ బిల్లు కావటంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాజ్యాంగపరంగా గవర్నర్ అనుమతి తప్పనిసరి. దీంతో ముసాయిదా బిల్లును గవర్నర్ వద్దకు పంపించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేయిస్తే కార్మికుల కుటుంబాలకు సత్వరమే లాభం కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముసాయిదా బిల్లును రాజ్భవన్కు పంపించి అనుమతి కోరింది.
కానీ బిల్లుకు రాజ్భవన్ (Raj Bhavan) మోకాలడ్డుతున్నది. బిల్లులోని పలు అంశాలపై సందేహాలున్నాయని, వాటిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరామని బిల్లు పంపిన రెండురోజుల తర్వాత శుక్రవారం రాత్రి రాజ్భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారుపై వ్యతిరేక వైఖరితోనే ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపుతున్నారని మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల్లో అధికశాతం బడుగు, బలహీన, పేద వర్గాలే ఉన్నారు. ఈ బిల్లు పాస్ అయిన తరువాత వారందరూ ప్రభుత్వ ఉద్యోగులవుతారు. జీతభత్యాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగ భద్రత కూడా లభిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న బిల్లుపై కూడా కాలయాపన చేసేలా గవర్నర్ వ్యవహరించడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
Latest Articles
- Advertisement -