ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 242 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ను 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో రూసో హాఫ్ సెంచరీ, శశాంక్ సింగ్ మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లు చెతులెత్తేశారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయగా.. ఫెర్గ్యూసన్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీ స్కోరు బాదింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ డూప్లిసెస్ విఫలం కాగా, విరాట్ పరుగుల వరద పారిం చాడు. మొత్తం 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 92 పరుగులు చేశాడు. మరోవైపు రజత్ పాటీదార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతులు ఎదుర్కొన్న పాటీదార్ 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 55 పరుగులు బాదాడు.
అనంతరం 242 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ దశలోనూ టార్గెట్ వైపు కొనసాగలేదు. ఆరంభంలోనే వికెట్ చేజార్చుకుంది. 6 పరుగులు చేసిన ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత రూసో, బెయిర్ స్టో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 65 పరుగుల చక్కటి భాగస్వామ్యం అందించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ కొద్దిసేపు ఆర్సీబీ బౌలర్లను నిలువరించాడు. ధాటిగా బ్యాటింగ్ చేసిన 19 బంతుల్లో 4 బౌండరీలు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. కోహ్లీ మెరుపు ఫీల్డింగ్ కారణంగా రనౌట్గా వెనుదిరిగాడు. అనంతరం జితేశ్ శర్మ, లివింగ్ స్టోన్, శామ్ కరన్ వెంటవెంటనే ఔట్ కావడంతో పంజాబ్ పరాజయం ఖాయమైంది.