తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్ది విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. SIB మాజీ DSP ప్రణీత్రావు విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కోసం రవిపాల్ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయిల్ నుంచి సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. రవిపాల్కు చెందిన ఐటీ కంపెనీ పేరుతో ట్యాపింగ్ పరికరాలు, అత్యాధునిక సాఫ్ట్వేర్ను దిగుమతి చేసుకున్నారని…ఇందుకు ఎస్ఐబీ ద్వారానే చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఇలా కొన్న ట్యాపింగ్ పరిక రాలను ప్రతిపక్ష నేతలు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్ల పరిసరాల్లో రవిపాల్ టీమ్ ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆయనను విచారించేందుకు పోలీసులు సిద్దమయ్యారు.
మరోవైపు తెలంగాణతో పాటు కర్ణాటకకు చెందిన రాజకీయ నేతల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్టు తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతల ఫోన్లను ప్రణీత్రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు.ఈ కేసులో అరెస్టయిన ప్రణీత్రావు, తిరుపతన్న, భుజంగరావును విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలంటూ ఇవాళ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తొలుత అరెస్టయిన డీఎస్పీ ప్రణీత్రావును ఇప్పటికే ఏడు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఆయనను మరోమారు కస్టడీకి అడగనున్నారు. ఆయనతోపాటు అరెస్టయిన అదనపు ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్నలను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరనున్నారు.