సస్పెండ్ డీఎస్పీ ప్రణీత్ రావు ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డే టార్గెట్గా ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. అది కూడా ఓ బీఆర్ఎస్ నేత ఆదేశాల మేరకు జరిగినట్టు విచారణలో బయటపడింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ వివరాలు స్వతంత్ర చేతికి చిక్కాయి. ఈ ఎపిసోడ్ అంతా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది. బీఆర్ఎస్ నేత వంద మంది ఫోన్ల నెంబర్లను ప్రణీత్ రావుకు ఇచ్చి వాటిని ట్యాప్ చేయాలని ఆదేశించాడు.
బీఆర్ఎస్ నేత ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ట్యాపింగ్ వ్యవహారం నడిపించాడు. రాత్రికి రాత్రి వంద మంది ఫోన్నెం బర్లను ట్యాప్ చేసి ఆ వివరాలను బీఆర్ఎస్ నేతకు అందించాడు ప్రణీత్ రావు. రేవంత్ రెడ్డిని ఎవరు, ఎక్కడ కలుస్తున్నారు అనే సమాచారాన్ని చేరవేశాడు. డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని కూడా బీఆర్ఎస్ నేతకు అందించాడు. రేవంత్ రెడ్డి సోదరులు, అనుచరులతోపాటు చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్టు తేలింది. అంతేకాకుండా కొంతమంది మీడియా పెద్దల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ప్రణీత్ రావ్ ఫోన్లో చాటింగ్లను రిట్రీవ్ చేశారు పోలీసులు. వీటి ఆధారంగా విచారణ ప్రారంభించారు.