ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు తెలంగాణలో హాట్టాపిక్. తెలంగాణలో ఎక్కడ చూసినా ట్యాపింగ్ ముచ్చట్లే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం రాజకీయరంగు పులుముకుంది. ఈ మొత్తం వ్యవహారంలో గతంలోని భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయక త్వంలోని గత ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు, ఉద్యమ సంస్థలు, హక్కుల కార్యకర్తలు, బడా వ్యాపారవేత్తలు, రియల్టర్లు సహా వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరు ప్రధానంగా తెరమీదకు వచ్చింది. ఎస్ఐబీగా పాపులర్ అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోని కొంతమంది ఉన్నతాధికారులు గత ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో స్పెషల్ ఇంటె లిజెన్స్ బ్యూరో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రణీత్ రావు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి.
ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహా అయన సన్నిహితులు పలువురి ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు విచారణలో తేలింది. అలాగే రెండు కిలోమీటర్ల రేడియస్లో టార్గెట్గా అనుకున్న వ్యక్తులు మాట్లాడు కునే అన్ని విషయాలు ట్యాపింగ్కు గురైనట్లు తెలిసింది. దీనికోసం విదేశాల నుంచి అత్యాధునిక టెక్నాలజీని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నతాధికారులు కొనుగోలు చేసిన అంశం వెలుగు చూసింది. ఇతరుల ఫోన్లు ట్యాప్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మూడు నుంచి నాలుగు వర్క్ స్టేషన్లు, డెస్క్ టాప్ మానిటర్లు, హెడ్ ఫోన్లతో కూడిన గది అవసరం. ఈ గది మొత్తాన్ని సీసీ టీవీ కెమెరా నిఘాలో ఉంచుతారు. అలాగే వీటితో పాటు సెల్ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సరిపడ సర్వర్లు, రికార్డింగ్ పరికరాలు, టెలికం సర్వీస్ ప్రొవైడర్లు అందజేసే కేబుల్స్ ఉండాలి.
ఇక విచారణ తరువాత వెలుగు చూసిన అంశాల మేరకు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కోసం రెండు సర్వర్లను వేరు వేరు ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఒక సర్వర్ను ప్రముఖ మీడియా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే సరిగ్గా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఒకరోజు ముందు, ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అన్ని హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు సమాచారం. అలాగే ట్యాపింగ్కు సంబం ధించిన సమస్త సమాచారాన్ని ధ్వంసం చేశాడు. కాగా కొన్ని హార్డ్ డిస్క్లను అడవిలో పడేశాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులను విచారించే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.ఇదిలా ఉంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకరరావు ఆదేశాలతోనే అప్పట్లో డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు ఈ మొత్తం వ్యవహారం నడిపినట్లు పోలీసులు కుండబద్దలు కొట్టారు.ప్రణీత్రావు ఒక్కరే కాదు…అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగ రావు ప్రమేయం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉందన్న విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు తిరుపతన్న, భుజంగరావును అరెస్టు చేశారు. కాగా ప్రతిపక్ష నేతలతో పాటు స్వంత పార్టీ నేతలపై కూడా భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే ల ఫోన్లు కూడా గతంలో ట్యాప్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి, బీజేపీ నేత రఘునందన్ రావు తమ ఫోన్లు గతంలోని ప్రభుత్వమే ట్యాప్ చేసిందంటూ రాష్ట్ర పోలీసు బాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. వీరేకాదు బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కూడా తన ఫోన్ను ట్యాప్ చేశారని ఆరోపించారు.