స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో …ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చిన సందర్భంగా మార్మోగుతున్న పేరు ఇది. స్పెషల్ ఇంటెలిజెన్స్ అనేది ఓ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. దేశంలో మావోయిస్టులు, తీవ్రవాదుల కార్యకలాపాలపై నిఘా కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. సహజంగా మావోయిస్టులు, తీవ్రవాదుల కార్యకలాపాలపై చెక్ పెట్టడమే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగా అనేక తీవ్రవాద సంస్థలు, వాటిలో పనిచేసే వ్యక్తులపై ఎస్ఐబీ నిఘా పెడుతుంది. స్థూలంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఇదీ. అయితే తెలంగాణలో ఎస్ఐబీ అందుకు భిన్నంగా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసింది. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగిన సమయా ల్లోనూ ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేయడానికి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోను గత ప్రభుత్వం ఉపయోగించు కుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఉప ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీకి సంబంధించిన డబ్బులను కూడా ఆయా నియోజకవర్గంలోని ఛోటామోటా నాయకులు ఎస్ఐబీ అధికారులే తరలించారన్న ఆరోపణలున్నాయి.
ఇదంతా ఒక ఎత్తయితే, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో లీలలు మరికొన్ని వెలుగు చూశాయి. రాజకీయ ప్రత్యర్థుల తోపాటు బడా వ్యాపారవేత్తలు, రియల్టర్లు ఫోన్లను కూడా ఎస్ఐబీ అధికారులు ట్యాప్ చేశారన్న విషయం బయటి కొచ్చింది. ఫోన్లు ట్యాప్ చేసిన తరువాత వారిని బెదిరించి, భారత్ రాష్ట్ర సమితి కోసం ఎలెక్టో రల్ బాండ్లు కొనిపించారన్న విషయం వెలుగు చేసింది. అయితే ఇదంతా ఎస్ఐబీలోని ఒకరిద్దరు అధికారులు వారి ఇష్టానుసారం చేసిన పని కాదు. అధికారంలో ఉన్నవారు ఏం ఆశించారో అది చేసి పెట్టారు ఎస్ఐబీ అధికా రులు.
అధికారంలో ఎవరున్నా, తమ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం సహజమైన ప్రక్రియే.దీనికోసం యధేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తారనే ఆరోపణలున్నాయి. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఇరికిం చడం వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో….ఒక దశలో …అసలు నా ఫోన్ ట్యాప్ చేయడానికి మీరెవరు అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. అంతేకాదు నలుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో బీజేపీకి చెందిన నేతలను పట్టుకున్న వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ లాంటి నిఘా ద్వారానే సాధ్యమైంది. మొత్తంమీద స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా ఏ ఒక్కరికీ పరిమితం కాలేదు. అటు ప్రతిపక్షం ఇటు అధికారపక్షం అనే తేడాలేకుండా అందరూ ఎస్ఐబీ నిఘాలో ఉన్నట్లే అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకరరావు విదేశాల నుంచి వస్తేనే కానీ అసలు గుట్టు బట్టబయలు అవుతుందనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జిల్లాల వరకు విస్తరించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.