పాక్ ఆక్రమిత కాశ్మీర్లో టెన్షన్.. టెన్షన్. ఈ ప్రాంతంలో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.శాంతి భద్రతలు రోజురోజుకూ దిగజారుతుండడం, సైన్యానికి ప్రజలు ఎదురు తిరుగుతుండడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే సైన్యం జరిపిన కాల్పుల్లో మరో ముగ్గురు ప్రజలు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పీవోకేలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు వచ్చిన సైన్యం తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.మొత్తం 11 వాహనాలతో సైనిక బృందం ముజఫరాబాద్ మీదుగా వెళుతున్నప్పుడు ఆందోళన కారులు. భారీ స్థాయిలో రాళ్లు రువ్వారు. దీంతో సైన్యం కాల్పులు జరిపింది. బాష్పవాయువు ప్రయోగించింది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సైతం మృతిచెందారు. 70 మందికి పైగా భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా పీవోకేలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 2300 కోట్ల రూపాయల సబ్సిడీని ప్రకటించడంతో శాంతి నెలకొంటుందని అంతా ఆశించారు. కానీ, పరిస్థితి అలా లేకపోవడంతో అంతా టెన్షన్ నెలకొంది.