పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీభవన్లో నిర్వహించిన మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్లో అంతర్గత తగాదాల పట్ల పార్టీ శ్రేణులపై మండిపడ్డారు. పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా కీలకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి, గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు. ప్రజలకు, పాలనా యంత్రాంగానికి మధ్య పార్టీ నాయకత్వం వారధిగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలన్నారు. స్ధానికంగా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు.