ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్న ఆయన.. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అధికార వైసీపీని గద్దె దించడం, కూటమి గెలుపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజులుగా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తున్నారాయన. ఉదయం కార్యకర్తలు, స్థానిక నేతలతో సమావేశాలు.. రోడ్ షో నిర్వహిస్తున్నారు. సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇవాళ నాలుగో రోజు పిఠాపురం నియోజవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు పవన్. గొల్లప్రోలు హెలిప్యాడ్ నుండి పిఠాపురం అగ్రహారం మీదుగా RTC కాంప్లెక్స్, చర్చ్ సెంటర్ కు చేరుకున్నారు. ఆంధ్ర బాపిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అనంతరం యూ.కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలోని బషీర్ బీబీ దర్గాను సందర్శిస్తారు. మాదాపురం, ఉప్పర గూడెం, నాగులపల్లి, పొన్నాడ వరకూ పవన్ ప్రచారం కొనసాగనుంది. తిరిగి మూల పేట జంక్షన్, అమీనాబాద్, ఉప్పాడ, కొత్తపల్లి చేరుకుని అక్కడ మహిళలతో సమావేశం నిర్వహి స్తారు. వాకతిప్ప, ఎండపల్లి జంక్షన్, కొండెవరం, నవ ఖండ్రావాడ మీదుగా పిఠాపురం పట్టణం లోని డ్రైవర్ కాలనీ, ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, టౌన్ పోలీస్ స్టేషన్, పాదగయా జంక్షన్, కుమారపురం సెంటర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్.