సార్వత్రిక ఎన్నికలకు సమాయాత్తమవుతున్నాయి తెలంగాణలోని రాజకీయ పార్టీలు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడంతో తమ దృష్టంతా ఇప్పుడు పూర్తిగా లోక్సభ ఎన్నికలపైనే నిలిపాయి. ఈ క్రమంలోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్.. ఎలాగైనా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు మాజీ మంత్రి కేటీఆర్.
తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలకు సమాయాత్తం కావాలంటూ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఆయా నేతలు అసెంబ్లీ స్థానాల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇవన్నీ కూడా వచ్చేనెల 26లోపు పూర్తి కావాలని ఆదేశించారాయన. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో కుంగిపోవద్దని.. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు కేటీఆర్.
ఇక, గెలుపే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో పనిచేయాలని కేటీఆర్ తమకు సూచించారన్నారు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదన్న ఆయన.. శాసనసభ ఎన్నికల్లో ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ ఫైరయ్యారు ఎంపీ రంజిత్ రెడ్డి.
పార్లమెంటు ఎన్నికల సన్నద్దతపై శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఈనెల 28న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో మండల అధ్యక్షులు, బీజేపీ నేతలతో.. షా సమావేశమై ఎన్నికల ప్రణాళికపై దిశానిర్దేశం చేస్తారు. ఇటీవలె జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. కొత్త ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికలకు సన్నద్దమవుతోంది. అందులో భాగంగానే పార్టీ వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు అమిత్ షా.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం మోగించింది. ఇటీవలె జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల సాక్షిగా లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే. అంతేకాదు.. రాష్ట్రంలోని వివిధ పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంఛార్జ్లుగా పలువురు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని విపక్షాలు భావిస్తుంటే.. లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహం రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ.


