పార్లమెంట్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారం దుమారం రేపింది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళన లతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది.
ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతిచెందిన పలువురు రాజకీయ ప్రము ఖులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్పీకర్ చర్చను ప్రారంభించగా ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ఇందుకు సభాపతి ఓం బిర్లా అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం కన్పించింది. నీట్ అంశంపై చర్చ కు పట్టుబడుతూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమ కొంతసేపు ఛైర్మన్ సభను నడిపించారు. అయినప్పటికీ వారు తగ్గకపోవడంతో ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. వారి నిరసనల నడుమే రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చను చేపట్టారు.