తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు ఈ రోజే ఆఖరు తేదీ. ఇవాళ్టితో గడువు ముగియనుండడంతో నామినేసన్లు భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు కూడా నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో ఈ సారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఒకరోజు గడువు ఉండగానే నిన్నటి వరకు అసెంబ్లీకి 3 వేల 644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు నిన్న నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరఫున పురందే శ్వరి, జనసేన తరఫున వల్లభనేని బాలశౌరి,ఉదయ్ శ్రీనివాస్ తదితరులున్నారు.
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆరో రోజైన నిన్న 188 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తంగా 603 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది, బీజేపీ నుంచి నలుగురు, బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. సికింద్రా బాద్ నుంచి దానం నాగేందర్, హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలత, వరంగల్, నల్గొండ, భువనగిరి స్థానాలకు ప్రదాన పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను సాయంత్రం ప్రకటించగా అంతకుముందు కరీంనగర్, ఖమ్మం స్థానాల నుంచి పలువురు ఆశావహులు నామినేషన్లు వేశారు. కొందరు అభ్యర్థులు రెండు, మూడు సెట్ల నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలు గడువు ఇవాళ్టితో ముగియనుంది.