స్వతంత్ర, వెబ్ డెస్క్: భారతదేశం మూడు దశాబ్దాల తరువాత ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు ఆతిధ్యం ఇవ్వనుంది. 1996 తరువాత భారత్ లో ఈ ఏడాది 71వ ప్రపంచ సుందరి – 2023 ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్పర్సన్, సీఈవో జులియా మోర్లే మీడియా సమావేశంలో ప్రకటించారు. 130 దేశాల జాతీయ ఛాంపియన్లు అద్భుతమైన భారతదేశంలో నవంబర్లో నెల రోజులు పాటు విడిది చేస్తారు. పలు ప్రతిభా ప్రదర్శనలు, క్రీడల సవాళ్లు, సేవా కార్యక్రమాలతో ఈ పోటీలు కొనసాగుతాయి. మార్పునకు రాయబారులుగా నిలిచే పోటీదారుల ప్రత్యేకతలను ప్రదర్శించడమే వీటి ఉద్దేశం’’ అని వివరించారు. ఈ పోటీల ప్రచారం కోసం భారత్కు వచ్చిన గతేడాది ప్రపంచ సుందరి విజేత కరోలినా బియెలావ్స్కా (పోలండ్) మాట్లాడుతూ.. ‘‘గొప్ప ఆతిథ్యానికి, విలువలకు ప్రతిరూపమైన ఈ అందమైన దేశంలో నా కిరీటాన్ని తదుపరి విజేతకు అందించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’’ అన్నారు.